వీధి విక్రయదారుల నిరసన | - | Sakshi
Sakshi News home page

వీధి విక్రయదారుల నిరసన

Jun 24 2025 4:19 AM | Updated on Jun 24 2025 4:19 AM

వీధి విక్రయదారుల నిరసన

వీధి విక్రయదారుల నిరసన

బీచ్‌రోడ్డు: వీధి విక్రయదారుల చట్టం, 2014లోని 39 సెక్షన్లు, 18 సౌకర్యాలతో కూడిన నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డి వేంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరరావు మాట్లాడుతూ, వీధి విక్రయదారుల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, మెమోలను జీవీఎంసీ అధికార యంత్రాంగం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. 2013 నుంచి 2025 వరకు జరిగిన ఆర్థిక అవినీతిపై, ఫైళ్ల తారుమారుపై జిల్లా కలెక్టర్‌తో సహా జీవీఎంసీ అధికార యంత్రాంగంపై జ్యుడిషియల్‌ విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర గెజిట్‌ 7 ఆఫ్‌ 2014, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్‌ 137లో పొందుపరిచిన వీధి విక్రయదారుల చట్టంపై వీధి విక్రయదారుల యూనియన్లతో జాయింట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. జీవీఎంసీ పరిధిలోని 8 జోన్లలో టౌన్‌ వెండింగ్‌ కమిటీ సభ్యులను బ్యాలెట్‌ ద్వారా ఎన్నుకునే హక్కును ప్రతి వీధి విక్రయదారుడికి కల్పించాలన్నారు.

హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జీవీఎంసీ 8 జోన్ల పరిధిలోని 2 లక్షల మంది వీధి విక్రయదారులకు వ్యక్తిగత ఫొటో గుర్తింపు కార్డులు, వ్యాపార భద్రతతో కూడిన కుటుంబ ఫొటోతో వెండింగ్‌ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌ చేసి మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. వీధి విక్రయదారుల సంక్షేమం కోసం జీవీఎంసీ పరిధిలోని జనసంచార స్థలాల్లో హాకర్‌ జోన్లు, షెడ్లు, సంతలు, మొబైల్‌ మార్కెట్లు, వెండింగ్‌ మార్కెట్లను నిర్మించాలని కూడా పిలుపునిచ్చారు. ఈ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement