
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఆరిలోవ: ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ పదో వార్డు పరిధి తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు సమావేశమయ్యారు. ఆదివారం చేపట్టనున్న డీఈవో కార్యాలయం ముట్టడిని ఉమ్మడి విశాఖ జిల్లా ఉపాధ్యాయులంతా విజయవంతం చేయాలని కోరారు. అక్కడ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధు లంతా చేతులు కలిపి ముట్టడికి సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడ నుంచి నాయకులు డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డీఈవో చాంబర్లో బైఠాయించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, సమస్యలు పరిష్కంచాలని, ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టాలని, వెబ్ ఆప్షన్ పెట్టవద్దని నినాదాలు చేశారు. అనంతరం ఆదివారం చేపట్టనున్న డీఈవో కార్యాలయం ముట్టడికి సంబంధించిన నోటీస్ను డీఈవో ఎన్.ప్రేమ్కుమార్కు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డి.గోపీనాథ్, ఇమంది పైడిరాజు, సీహెచ్.వేణుగోపాల్, టి.రామకృష్ణ, టి.ఆర్ అంబేడ్కర్, అరుణ్కుమార్, ధనుంజయ, చిన్నారావు, సూర్యనారాయణ పాల్గొన్నారు.

ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి