
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
కలెక్టర్కు ఏపీయూడబ్ల్యూజే వినతి
మహారాణిపేట: జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు నాలుగు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు యూనియన్ నేతలు కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వారికి ఆనందపురం, సబ్బవరం, పెందుర్తి మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో స్థలాలు కేటాయించాలని యూనియన్ అధ్యక్షుడు కె.రాము, ప్రధాన కార్యదర్శి ఆర్.రామచంద్రరావు కోరారు. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రామచంద్రరావు తెలిపారు. యూనియన్ ప్రతినిధులు బి.నారాయణరావు, డి. హరినాథ్, రవి తదితరులు పాల్గొన్నారు.