
కార్మిక హక్కుల సాధనకు ఉద్యమం
● మే 20 అఖిల భారత సమ్మెను విజయవంతం చేయండి ● మేడే సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపు
సీతమ్మధార: మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణ కోసం ఉద్యమించాలని, మే 20న జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా గురువారం దొండపర్తి రైల్వే డీఆర్ఎం కార్యాలయం నుంచి ఆశీలమెట్ట వరకు సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించిన హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. 29 కార్మి క చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి యజమానులకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వంటి చర్యలను ఆయన తప్పుబట్టారు.
స్కీమ్ వర్కర్లను
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోదీ విధానాలనే అమలు చేస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి. కుమార్ విమర్శించారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, వీవోఆర్పీలకు పనిభారం పెంచి వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గత 15 ఏళ్లుగా కనీస వేతనాల జీవోలు సవరించకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని, కనీస వేతనం నెలకు రూ. 26 వేలు ఉండేలా జీవోలు ఇవ్వాలని కోరారు. ఆప్కాస్ రద్దు చేసి పాత కాంట్రాక్ట్ విధానం తీసుకురావడం దుర్మార్గమని, ఆప్కాస్ రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.మణి, జిల్లా ఆఫీస్ బేరర్స్ పి.వెంకటరెడ్డి, ఎం.సుబ్బారావు, పి.వెంకటరావు, పి.కృష్ణారావు, జి.అప్పలరాజు, కె.కుమారి, టి.నూకరాజు, టి.నాయుడు, ఆర్.నాయుడు, వై.రాజు, అప్పలనాయుడు, కె.శేఖర్, ఎ.సీతాలక్ష్మి, ఎంసీహెచ్. అప్పడు, కె.జె.అప్పారావు,శ్రీనివాస్, ఝాన్సీ , మల్లీశ్వరి సీతారత్నం, నరేంద్రకుమార్, పెద్ద సంఖ్యలో వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.

కార్మిక హక్కుల సాధనకు ఉద్యమం