
అడవివరంలో విషాదఛాయలు
సింహాచలం: సింహగిరిపై రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో స్టీల్ప్లాంట్ జనరల్ ఫోర్మెన్ ఎడ్ల వెంకటరావు(56) మృతితో అడవివరంలో విషాదం నెలకొంది. పాతికేళ్లుగా ఈయన ఇక్కడి బీసీ గురుకుల పాఠశాల సమీపంలో నివసిస్తున్నారు. ఆయన భార్య రామలక్ష్మి గురుకుల పాఠశాలలోనే స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రవీణ్కు నెల రోజుల క్రితం వివాహం కావడంతో భార్యతో కలిసి బెంగళూరులో, చిన్నకుమారుడు పృధ్వీ చైన్నెలో ఉంటున్నారు. చందనోత్సవం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఇంటి నుంచి కొండపైకి వెళ్లారు. వెళ్లిన గంటలోగానే మరణించారు. కేజీహెచ్లో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగృహానికి తీసుకొచ్చి, పాత అడవివరం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. స్టీల్ప్లాంట్ ఏఐటీయూసీ గుర్తింపు యూనియన్ నాయకుడు పాశర్ల పైడిరాజు, స్టీల్ప్లాంట్ సిటు నాయకుడు అప్పారావు, ట్రేడ్ యూనియన్ నాయకులు తరలివచ్చి వెంకటరావు మృతదేహానికి నివాళులు అర్పించారు. ఎప్పుడూ సరదాగా ఉండే వెంకటరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.