
రోడ్లపైనే కాలం చెల్లిన మందులు
నగరంలో పలు చోట్ల రోడ్ల పక్కన చెత్తకుప్పల్లో కాలం చెల్లిన మందులు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా వీటిని ఇన్సినరేటర్లో వేసి బూడిద చేయాల్సి ఉంది. కానీ సుమారు టన్నుల కొద్ది వచ్చే ఈ వ్యర్థాలను సకాలంలో కాల్చకుండా .. ఇలా ఖాళీ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా పారబోస్తున్నారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ తరహా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. నిబంధనలను ఏమాత్రం లెక్కచేయక ఈ ఆస్పత్రులు, మెడికల్ షాపులు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. బయో వ్యర్థాలను తరలించేందుకు సంబంధిత యాజమాన్యాలు కొంత మొత్తం ఏపీపీసీబీ సూచించే వ్యర్థాల నియంత్రణ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఆస్పత్రి స్థాయికి తగ్గట్టు డబ్బులు చెల్లించాలి. పలుచోట్ల ఆయా సంస్థలు సక్రమంగా వచ్చి వ్యర్థాలను తీసుకెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క నగరంలోనే దాదాపు 600కు పైగా ఆస్పత్రులు ఉన్నాయి. పూర్తిస్థాయిలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలు దాదాపు బయట ప్రాంతాల్లో పోస్తున్నారు. నగరంలోని ఆస్పత్రుల్లో పది శాతానికి మించి నిబంధనలు పాటించడంలేదు. కాలం చెల్లిన మందులు, ఇతర వ్యర్థాల్ని ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నెలకు రూ.1,100 చెల్లిస్తే చాలు ప్రతీ ఆస్పత్రి వద్దకు వచ్చి నిర్వహణ సంస్థలు స్వయంగా తీసుకువెళ్తాయి. కానీ ఎవరూ దీనిని పట్టించుకోవడం లేదు. కాల పరిమితి ముగియడానికి 90 రోజులే గడువున్న మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో పంపిణీ చేయకూడదని నిబంధనలున్నాయి.
అలాంటి మందులను సరఫరా చేసిన కంపెనీలకే తిప్పి పంపాల్సిందే. ఎందుకంటే ఒక ఔషధం దాని కాలపరిమితి తేదీకి 3 నెలల ముందు నుంచి అందులోని మందు శక్తిని కోల్పోతూ ఉంటుందని, అలాంటి మందులు వాడినా ప్రభావశీలంగా పనిచేసే అవకాశాలు తక్కువని వైద్యులు చెబుతున్నారు. ఇన్ని నిబంధనలున్నా వాటిని పక్కనపెట్టేసి ఆస్పత్రులు ఇలా పడేస్తుండటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు కళ్లు తెరవకపోతే.. నగరం బయోవ్యర్థాలమయంగా మారిపోయే ప్రమాదముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.