ఏడు గ్రాముల బంగారం రికవరీ
తాండూరు టౌన్: మహిళ మెడలో నుంచి బంగారం చోరీ చేసిన మరో మహిళను పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన సొమ్మును బాధితురాలికి అప్పగించారు. ఈ ఘటన పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన గౌతాపూర్ వెంకటమ్మ అనారోగ్యంతో ఈనెల 23వ తేదీన తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. అదే రోజు రాత్రి ఆమె మెడలోని 7 గ్రాముల సన్నగుండ్ల బంగారు గొలుసు చోరీకి గురైంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజీ ఆధారంగా ఓ మహిళ చోరీకి పాల్పడినట్లు తేల్చారు. అనంతరం విచారణలో దొంగతనం చేసిన మహిళ పట్టణంలోని వాల్మీకినగర్కు చెందిన కుర్వ పద్మగా గుర్తించారు. విచారణలో గొలుసు చోరీ చేసినట్లు ఒప్పుకుంది. గొలుసును రికవరీ చేసి శనివారం బాధితురాలికి అప్పగించినట్లు పట్టణ సిఐ సంతోష్ కుమార్ తెలిపారు.
విద్యార్థి అరెస్ట్
లక్డీకాపూల్ : బైక్పై స్టంట్స్చేస్తున్న ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సైఫాబాద్ పోలీసులు తెలిపిన మేరకు.. ఓల్డ్ మలక్ పేట్ శంకర్ నగర్ కు చెందిన ఇబ్రహీం బేగ్ అనే విద్యార్థి సోషల్ మీడియాలో రీల్స్ కోసం రాష్ట్ర సచివాలయం వద్ద శుక్రవారం ప్రమాదకరంగా బైక్పై స్టంట్లు చేస్తూ వాహనదారులను, పాదచారులను భయాందోళనకు గురిచేశాడు. ఈ విషయంపై సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నారు. బైక్ను, వీడియోలు చిత్రీకరించిన మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్ఓటీ పోలీసుల దాడులు: మద్యం బాటిళ్ల స్వాధీనం
యాచారం: మండల పరిధిలోని నస్దిక్సింగారంలో శుక్రవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. శ్రీరామనవమి రోజు మద్యం విక్రయించరాదని నింబంధనలు ఉన్నప్పటికీ గ్రామంలో రాజు అనే వ్యక్తి మద్యం విక్రయిస్తున్నాడని సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. అతని ఇంట్లో 50 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
శంషాబాద్ డీసీపీ రమేష్
ఇబ్రహీంపట్నం రూరల్: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని శంషాబాద్ డీసీపీ రమేష్ పేర్కొన్నారు. ఆదిబట్ల పోలీస్స్టేషన్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై సీఐ రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆదిబట్ల ఏసీ పీ ప్రదీప్కుమార్రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధికి కృషి
కందుకూరు: గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని మండలంలోని గుమ్మడవెల్లి సర్పంచ్ పల్స మహేశ్గౌడ్ అన్నారు. శుక్రవారం గ్రామంలో హెచ్ఎండీఏ నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మౌనికసంతోష్, వార్డు సభ్యులు ప్రమీల మహేందర్గౌడ్, తిరుమలేష్, అనసూయయాదయ్య, నాయకులు మహేందర్, శ్రీనివాస్గౌడ్, బాబురావు, నరసింహగౌడ్, యాదయ్య, అరవింద్, శ్రీశైలంగౌడ్, అల్లె యాదయ్య, సంజీవ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రం ప్రారంభం
కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్లో అమేజాన్ సంస్థ పునరుద్ధరించిన అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. అక్కడ చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శాంతిశ్రీ, సర్పంచ్ అంజమ్మ, ఉప సర్పంచ్ సంధ్య, అమేజాన్ మేనేజర్ తాతాజీ, రిషిక, పార్థసారథి, సురేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్రీలత, శోభ, సువర్ణ, స్థానిక నాయకులు అమరేందర్రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు.


