
కేజీబీవీల్లో కొత్త రుచులు
కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూ తీసుకువచ్చింది. నెలలో రెండుసార్లు మటన్, ఐదుసార్లు గుడ్లు, ప్రతీ రోజు నెయ్యి ఉండేలా మెనూ ప్రకటించారు.
దౌల్తాబాద్: నాణ్యమైన విద్య, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా కేజీవీలు నిర్వహిస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతలు రాష్ట్రప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీల బలోపేతానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. బాలిక ఆరోగ్యంపై సర్వే చేపట్టగా పౌష్టికాహారలోపంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం బాలికలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కేజీబీవీల్లో మెస్ చార్జీలు పెంచి ఆహార మెనూలో మార్పులు చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం ఆహారం అందజేస్తున్నారు.
మెనూ ఇలా..
ఉదయం: టమాట కిచిడీ, సాంబార్, రాగిజావ, బూస్టు, పూరి, ఉప్మా, పులిహోరా, బోండా, వడ, చపాతీ, జీరారైస్, అరటిపండు
మధ్యాహ్నం: టమాట పప్పుతో అన్నం, నేయి, రసం, పెరుగు, ఉడకించిన గుడ్డు, చికెన్
సాయంత్రం: ఉడికించిన శనగలు, బజ్జీలు, అల్లం టీ, మిల్లెట్ బిస్కెట్, పకోడి
రాత్రి: అన్నం వివిధ రకాల కాయగూరలు, సాంబారు, మజ్జిగ వీటితో పాటు నెలలో రెండుసార్లు మటన్, ఐదుసార్గుల గుడ్లు, ప్రతీరోజు నెయ్యి ఇవ్వాల్సి ఉంటుంది.
బాలికల పౌష్టికాహారం కోసం
నూతన మెనూ
నెలలో రెండు సార్లు మటన్,
ఐదుసార్లు గుడ్లు
మెస్చార్జీలు పెంచిన ప్రభుత్వం
కొత్త మెనూ ప్రకారమే..
విద్యా సంవత్సరం ప్రారంభం నాటి నుంచే మెనూను కేజీబీవీల్లో అమలు చేస్తున్నాం. ఇప్పటికే కొత్త మెనూ పక్కాగా అమలు చేయాలని ఎస్ఓలకు ఆదేశాలు జారీ చేశాం. కొత్త మెనూను ప్రదర్శనకు ఉంచాలని సూచించాం.
– శ్రీదేవి, జీసీడీఓ, వికారాబాద్