
రూ.7 కోట్ల విలువైన భూమికి ఎసరు!
షాద్నగర్ రూరల్: ధరణి లొసుగులు.. మీసేవ నిర్వాహకుల సహకారంతో తండ్రీకొడుకులు రూ.7 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమికి ఎసరుపెట్టారు. ప్రభుత్వం ఇటీవల చిల్కమర్రిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. బాధితులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో తహసీల్దార్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మీసేవ నిర్వాహకులతో కుమ్మకై ్క..
గ్రామానికి చెందిన కొత్తపల్లి వినోద, శ్రీనివాస్రెడ్డి దంపతులు. కొంత కాలం క్రితం శ్రీనివాస్రెడ్డి చనిపోవడంతో ఆయన పేరిట ఉన్న 2.8 ఎకరాల భూమి 2022లో వినోద పేరిట విరాసత్ జరిగింది. ఈ భూమిపై కన్నేసిన వినోద మామ సుభాన్రెడ్డి, బావ మధుసూదన్ రెడ్డి పట్టణంలోని ఓ మీసేవ నిర్వాహకులతో కుమ్మక్కయ్యారు. వినోదకు తెలియకుండా ఆమె ఫోన్కు వచ్చిన ఓటీపీని సంపాదించి దొంగ జీపీఏ డాక్యుమెంట్ సృష్టించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ వివరాలు తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయింగా జీపీఏ ద్వారా ఇతరులకు మారిందని చెప్పారు. సదస్సులు ముగిసిన తర్వాత వినోద తహసీల్దార్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.
ఇదే గ్రామంలో మరొకరి భూమిని
ఇదే గ్రామానికి చెందిన కొత్తపల్లినర్సింహారెడ్డి, నవనీత దంపతులకు మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. నర్సింహారెడ్డి పేరిట 1.29 ఎకరాల భూమిని కాజేసేందుకు సుభాన్రెడ్డి, మధుసూదన్రెడ్డి ఆమె భార్య నవనీతను రంగంలోకి దింపారు. భర్త ఫోన్ నవనీత దగ్గరే ఉండడంతో ఓటీపీ తీసుకుని జీపీఏ డాక్యుమెంట్ సృష్టించారు. సదరు భూమిని దేవిరెడ్డి శ్రీకాంత్రెడ్డికి సేల్డీడ్ చేశారు. తహసీల్దార్ విచారణలో ఈ తతంగమంతా బయటపడింది. ఇద్దరు పట్టాదారులకు సంబంధించి రూ.7కోట్ల విలువైన దాదాపు నాలుగు ఎకరాల భూమిని కాజేసినట్లు తేలింది.
పోలీస్స్టేషన్లో తహసీల్దార్ ఫిర్యాదు
పట్టాదారులకు తెలియకుండా భూములు చేతులు మారడంతో తహసీల్దారు పార్థసారధి సదరు భూముల రిజిస్ట్రేషన్పై విచారించారు. స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ తయారీ ఎక్కడ జరిగిందనే విషయాలను పరిశీలించారు. మీసేవ సెంటర్లో ఓటీపీలతో డాక్యుమెంట్ తయారు చేసినట్లు గుర్తించారు. సదరు మీసేవ నిర్వాహకులతో పాటుగా దొంగ జీపీఏ, రిజిస్ట్రేషన్ చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చిల్కమర్రి రెవెన్యూ సదస్సులో వెలుగులోకి..
అధికారులను ఆశ్రయించిన బాధితులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్