
పారిశుద్ధ్యంపై దృష్టిసారించండి
ఇబ్రహీంపట్నం: వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వ్యాధుల బారిన ప్రజలు పడకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి వి.సురేష్మోహన్ సూచించారు. బుధవారం దండుమైలారం గ్రామ పంచాయతీని సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. నర్సరీ, డంపింగ్యార్డును, వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వానాకాలంలో ఈగలు, దోమలు వ్యాప్తిచెంది వ్యాధులు ప్రబలే అవకాశముంటుందన్నారు. క్రమంతప్పకుండా పారిశుద్ధ్య పనులు చేయించాలని సూచించారు. ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎస్ రఘు, పంచాయతీ కార్యదర్శి పి.శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
డీపీఓ సురేష్మోహన్
దండుమైలారంలో పర్యటన