
ట్రాన్స్ఫార్మర్ను కప్పేసిన చెట్లు
విద్యుత్ను నియంత్రించే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెట్లపొదలు పెరిగి ఆన్ ఆఫ్ చేసేందుకు అవరోధంగా మారింది. వర్షాకాలంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉండడంతో స్థానికులు కలవరపడుతున్నారు. ఈ దుస్థితి మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో దర్శనమిస్తోంది. అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. – మోమిన్పేట
21న యోగా దినోత్సవం
కొడంగల్: ప్రపంచ యోగా దినోత్సవాన్ని శనివారం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్, పాఠశాల విద్యాశాఖ నుంచి తనకు బుధవారం ప్రొసీడింగ్స్ వచ్చాయని ఎంఈఓ రాంరెడ్డి తెలిపారు. ఉదయం 6.30 నుంచి 7.45 గంటల వరకు యోగా తరగతులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రాథమిక, ఉన్నత, జిల్లా పరిషత్, కస్తూర్బా, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులతో యోగా చేయించాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు.
ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ రాంరెడ్డి అన్నారు. నియోజవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. నియమాలకు లోబడి ఫీజులు వసూలు చేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్, దుస్తులు, నోట్ పుస్తకాలు తదితర సామగ్రిని పాఠశాలలో అమ్మరాదని హెచ్చరించారు.
ఎంఈఓ రాంరెడ్డి