
అనుమతి లేక.. ఆగిన రోడ్డు
దౌల్తాబాద్: అసంపూర్తి రోడ్డుతో మండలవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దౌల్తాబాద్ నుంచి రావల్పల్లి వెళ్లే దారిలో, కౌడీడ్ నుంచి దౌల్తాబాద్ వెళ్లే మార్గంలో అటవీశాఖ అనుమతులు లేక రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దౌల్తాబాద్ నుంచి రావల్పల్లికి నాలుగు వరుసల రహదారి మంజూరైంది. రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, అటవీ ప్రాంతం ఉన్న కిలోమీటర్ మేర అనుమతులు లేక నిలిచిపోయాయి. అలాగే బాలంపేట– అల్లాపూర్, గుండేపల్లి– అల్లాపూర్ మీదుగా గుముడాల వరకు ఉన్న అటవీ ప్రాంతంతో కూడా అనుమతులు లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో అటవీశాఖ అధికారులతో మాట్లాడి అనుమతులు ఇప్పించి, రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.