
కల్యాణ మండపంలో షార్ట్ సర్క్యూట్
రూ.15 లక్షల ఆస్తి నష్టం
తాండూరు టౌన్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కల్యాణ మండలంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఫైర్ సేఫ్టీ అధికారి జలంధర్రెడ్డి తెలిపిన ప్రకారం.. పట్టణంలోని వీరశైవ కల్యాణ మండపంలో ఉదయం ఒక్కసారి గా మంటలు చెలరేగినట్టు సమాచారం అందడంతో సిబ్బంది కలిసి ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చాం. ప్రమాద కారణంగా ఫర్నిచర్తో పాటు పలు వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఘటనా సమయంలో హాల్ లో ఎటువంటి కార్యక్రమం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సుమారు రూ.15లక్షల ఆస్తి నష్టం వాటిల్లిన్నట్లు వీరశైవ సమాజ సభ్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఎన్నికల హామీలు
అమలు చేయండి
కిసాన్ సంఘ్ వ్యవస్థాపక
అధ్యక్షుడు విజయ్కుమార్
పరిగి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి కిసాన్ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్కుమార్ మంగళవారం వినతిపత్రం అందజేశారు. రుణమాఫీ పూర్తిగా కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. రైతు భరోసా కాలయాపన చేయొద్దని విన్నవించారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న రైతు భరోసాను రైతుల ఖాతాల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చేపల వేటకు వెళ్లిన
వ్యక్తి మృతి
దౌల్తాబాద్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీటమునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని తిర్మలాపూర్ మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రవిగౌడ్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నబాయి జైపాల్(32) భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్లో మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల కిత్రం స్వగ్రామానికి వచ్చిన జైపాల్ ఆదివారం గ్రామంలోని జానకి చెరువులో చేపల వేటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం చెరువుగట్టుపై బట్టలు చూసిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చెరువులోని ఓ గుంటలో ఉన్న శవాన్ని వెలికి తీశారు. భార్య శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు సంతానం.
ఫోన్ ట్యాపింగ్తో టార్గెట్ చేశారు
● వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారు
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి
షాద్నగర్రూరల్: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు తన ఫోన్ ట్యాపింగ్చేసి, టార్గెట్ చేశారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్తో తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఓడించాలనే ఆలోచనతో తాను మాట్లాడిన మాటలను ట్యాపింగ్ చేశారని, తనతో మాట్లాడిన నాయకులు, కార్యకర్తల సంభాషణలను బహిర్గతం చేసి ఏం సాధించారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్థానిక నాయకుల పాత్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తనకు టికెట్ రాదని ముందుగానే ప్రచారం చేశారంటే ఫోన్ ట్యాపింగ్ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. చివరికి తన భార్యా పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడిన మాటాలను కూడా ట్యాపింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు మోహన్సింగ్, లష్కర్నాయక్, మహేందర్రెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, బాల్రెడ్డి, అనిల్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కల్యాణ మండపంలో షార్ట్ సర్క్యూట్

కల్యాణ మండపంలో షార్ట్ సర్క్యూట్