
రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలి
తెలంగాణ కిసాన్ సంఘ్ వ్యవస్థాపకఅధ్యక్షుడు విజయ్కుమార్
అనంతగిరి/పరిగి: రైతులందరికీ రుణమాఫీ పథకం అమలు చేయాలని తెలంగాణ కిసాన్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్కుమార్ కోరారు. సోమవారం ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సగం మందికే రుణమాఫీ అమలు చేయడం సరికాదన్నారు. రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి కొర్రీలు పెట్టారని మండిపడ్డారు. దీంతో చాలా మందికి అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుత సీజన్కు సంబంధించి పంట రుణాలు ఇవ్వకుండా బ్యాంకర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వక్తం చేశారు. పొలం ఉన్న ప్రతి రైతుకూ రైతు భరోసా డబ్బు జమ చేయాలని డిమాండ్ చేశారు.