
సాగు.. పిరం!
కొడంగల్: ఏరువాక ముగిసింది. మృగశిర కార్తె ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమయ్యారు. అడపాదడపా వర్షాలు సైతం కురుస్తున్నాయి. దీంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరువులు, విత్తనాలకు డిమాండ్ పెరిగింది. ధరల పెరుగుదలపై నియంత్రణ లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి. వ్యవసాయం పండుగలా మారిన రాష్ట్రంలో రైతన్నలకు సాగు ఖర్చులు పెరిగి పోయాయి. పెట్టుబడి పెట్టలేక ఎరువులు కొనలేక అవస్థల పాలవుతున్నారు. విత్తనాలు వేసే క్రమంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి సాయం వస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు.
ఖర్చులు పెరిగాయి..
రైతు భరోసా పథకం కింద ఎకరాకు గత ప్రభుత్వం రూ.5 వేలు ఇచ్చేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేలు ఇస్తోంది. నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి సుమారు 40 వేల హెక్టార్లలో రైతులు పలు రకాల పంటలను సాగు చేసే అవకాశం ఉంది. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు వాటి నాణ్యతా ప్రమాణాలను బట్టి ఒక్కో ధర ఉంది.
విత్తనాల ధరలు ఎక్కువే
బహిరంగ మార్కెట్లో విత్తనాల ధరలు అధికంగానే ఉన్నాయి. కిలో కంది విత్తనాల బ్యాగు రూ.250 ఉంది. జొన్నలు 3 కిలోల బస్తా రూ.550, వరి బస్తా రూ.900, పెసర విత్తనాల బస్తా రూ.800 పత్తి విత్తనాలు 475 గ్రాములకు రూ.850 పలుకుతోంది.
యంత్రాలతో విత్తనం..
నియోజకవర్గంలోని రైతులు ఆధునిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. గతంలో ఉన్న కూలీ రేట్లకు ఇప్పటి రేట్లకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. సాగు ఖర్చులు పెరిగి పంట దిగుబడి రాకపోతే నష్టపోతున్నామని రైతులు భావిస్తున్నారు. ఆధునిక సేద్యం చేస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. సాగు ఖర్చులను తగ్గించుకొని యంత్రాల వినియోగంతో పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని పూణే నుంచి సాగు యంత్రాలను కొనుగోలు చేసి తెస్తున్నారు. వీటితో కంది, పెసర, మినుము, కుసుమలు, జొన్న విత్తనాలు వేస్తున్నారు. రోజుకు 8 ఎకరాల విస్తీర్ణంలో విత్తనాలు వేయవచ్చని రైతులు చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో పంటలు పండించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా మేరకు ఈ యంత్రాలను కొనుగోలు చేసినట్లు రైతులు చెప్పారు.
పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలు
ఇదే దారిలో కూలీ రేట్లు
ప్రారంభమైన ఖరీఫ్ సీజన్
ఎరువులు విత్తనాలకు డిమాండ్
రైతు భరోసా కోసం ఎదురు చూపు
ఎరువు ధర
డీఏపీ రూ.1,350
కాంప్లెక్స్ రూ. 1,370
గ్రోమోర్ రూ.1,700
10.26.26 రూ.1,470
ఎమ్ఓపీ రూ.1,535
యూరియా రూ.266
ఖర్చులు పెరిగాయి
గతేడాదితో పోలిస్తే ఈసారి సాగు ఖర్చులు పెరిగాయి. కూలీల ధరలతో పాటు ఎరువులు విత్తనాల ధరలు అధికంగా ఉన్నాయి. ఎరువులు కొనడానికి రైతులకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం సాగు ఖర్చుల కోసం రైతు భరోసా ఇస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతు భరోసా డబ్బులు వస్తే మేలు జరుగుతుంది.
– చుక్కప్ప, కొడంగల్

సాగు.. పిరం!