సత్తాచాటిన కీర్తన | - | Sakshi
Sakshi News home page

సత్తాచాటిన కీర్తన

Jun 15 2025 9:20 AM | Updated on Jun 15 2025 9:20 AM

సత్తాచాటిన కీర్తన

సత్తాచాటిన కీర్తన

బడంగ్‌పేట్‌: బడంగ్‌పేటకు చెందిన గుడ్ల రాధ, శ్రీనివాస్‌ దంపతుల కూతురు కీర్తన నీట్‌ ఫలితాల్లో 468 ర్యాంకుతో సత్తాచాటింది. ఉస్మానియా, లేదా గాంధీ మెడికల్‌ కాలేజీలో తనకు ఎంబీబీఎస్‌ సీటు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, స్థానికులు ఆమెను అభినందించారు.

గంజాయి విక్రేత అరెస్టు

కేపీహెచ్‌బీకాలనీ: మహారాష్ట్రలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదర్‌నగర్‌లో ఎక్కువ ధరకు విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ యువకుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద బ్యాగులో ఉన్న 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ ప్రాంతంలో నివాసం ఉండే బచ్చల లోకేష్‌ (22) సెంట్రింగ్‌ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా ఉన్న కొందరు యువకులతో కలిసి గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పర్బనీ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌నగర్‌ వద్ద నల్లటి బ్యాగులో అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది.

భర్తను హత్య చేసిన భార్య

ఇనుపరాడ్‌తో కొట్టడంతో తీవ్రగాయాలతో మృతి

సైదాబాద్‌: భర్తకు మద్యం తాగించి..మత్తులో ఉన్న అతడిపై భార్య ఇనుపరాడ్‌తో దాడి చేయటంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జీషాన్‌ అలీ (45) నగరానికి వలస వచ్చి 18 ఏళ్ల క్రితం చంద్రా అలియాస్‌ అయేషా పర్వీన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. చాలా కాలం ఎల్‌బీనగర్‌లో నివసించిన వీరు తమ ఐదుగురు సంతానంతో ఇటీవల సింగరేణి కాలనీలో అద్దెకు దిగి పూల వ్యాపారం చేసేవారు. జీషాన్‌ అలీ తరచూ మద్యం సేవించి భార్యతో గొడవ పడేవాడు. యూపీలోని శరన్‌పూర్‌లో నివసించే అతని సోదరుడు షకీర్‌ అలీ వారిని ఫోన్‌లో సముదాయించే వాడు. అయితే అయేషా ఇటీవల మరొకరితో చనువుగా ఉంటుందని జీషాన్‌ అలీ భార్యతో గొడవపడటం ఎక్కువైంది. ఈ నెల 11న అయేషా తన భర్తను ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా కొడుతుండగా వారి ఇంటి నుంచి వచ్చిన శబ్దాలు విని స్థానికులు వెళ్లి ఆమెను అడ్డుకొని జీషాన్‌ను పడుకోబెట్టి వెళ్లి పోయారు. మరుసటి రోజు అయేషా తన భర్తను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు పరీక్షించి అతని పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియాకు తీసుకెళ్లమన్నారు. అక్కడికి వెళ్లగా..అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు షకీర్‌ అలీ శుక్రవారం యూపీ నుంచి నగరానికి వచ్చి ఓజీహెచ్‌లో తన అన్న మృతదేహాన్ని గుర్తించాడు. తన సోదరుడిని కొట్టి చంపిన అయేషాపై సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement