
అధిక యూరియాతో అనర్థం
● సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి ● వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిమళ, డాక్టర్ శేఖర్
పరిగి: పంటల సాగులో రైతులు అధికంగా యూరియా వాడుతున్నారని, దీని వల్ల ఎటాంటి ప్రయోజనం లేకపోగా భూ సారం దెబ్బతింటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిమళ, డాక్టర్ శేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని సైదుపల్లి రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దాన్ని తగ్గించాలని సూచించారు. సేంద్రియ సాగుపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కొనుగోలు చేస్తే తప్పని సరిగా రశీదు తీసుకోవాలన్నారు. పంట కాలం పూర్తయ్యే వరకు వాటిని భద్రపరచుకోవాలని సూచించారు. ఒక వేళ పంట దెబ్బతింటే నష్ట పరిహారం పొందేందుకు రశీదులు ఉపయోగపడతాయన్నారు. వరి సాగుకు నీటిని ఎక్కువగా వాడకూరాదని, రెండు, మూడు రోజులకు ఒక్కసారి పొలానికి నీరు పెడితే సరిపోతుందని తెలిపారు. పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. పప్పు దినుసుల దిగుబడి భారీగా తగ్గిపోయిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, పరిగి వ్యవసాయ సంచాలకులు సౌభాగ్యలక్ష్మి కుమారి, మండల వ్యవసాయ అధికారి రజిత, ఏఈఓ ప్రసిల్లా, పంచాయతీ కార్యదర్శి విజయభాస్కర్, సైదుపల్లి ఇందిరమ్మ కమిటీ సభ్యులు గణేష్, గోపాల్ రెడ్డి, అన్వర్, నర్సింలు పాల్గొన్నారు.