
ఒక మార్పు.. అభివృద్ధికి మలుపు
● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ● మున్సిపల్ అభివృద్ధికి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం
తాండూరు టౌన్: ఒక మార్పు.. అభివృద్ధికి మలుపు అనే నినాదంతో తాండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించి, జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని సుందరంగా, పచ్చదనంగా, పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పరిరక్షణ, మొక్కలు నాటడం, పట్టణ సుందరీకరణ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ విక్రమ్సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈఈ ఖాజహుస్సేన్, సిబ్బంది, మెప్మా ఆర్పీలు, వార్డు ఆఫీసర్లు తదితరులు కార్యాలయం నుంచి ఇందిరాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ధారాసింగ్, మాజీ కౌన్సిలర్లు రత్నమాల, నీరజ, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.