కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలి

May 28 2025 5:55 PM | Updated on May 28 2025 5:55 PM

కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలి

కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలి

అనంతగిరి: ప్రజా సమస్యలపై ఈ నెల 30న తలపెట్టిన కలెక్టర్‌ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్‌.వెంకట్రాములు పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందజేయాలని కోరారు. అలాగే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహిపాల్‌, జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ, వెంకటయ్య, చంద్రయ్య, సతీశ్‌, శ్రీనివాస్‌, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

టీబీ నివారణకు కృషి

జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి రవీందర్‌యాదవ్‌

దౌల్తాబాద్‌: టీబీ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి రవీందర్‌యాదవ్‌ అన్నారు. టీబీ ముక్త భారత్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో మంగళవారం మాటూరు గ్రామంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ వ్యాధి ఉన్న వారికి జ్వరం, దగ్గు, నీరసం బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలు ఉన్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ శిబిరంలో 360మందికి పరీక్షలు చేయగా 63 మందిని అనుమానితులుగా గుర్తించారు. వీరికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు ఇవ్వన్నుట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి అమూల్య ప్రియదర్శిని, సంతోష్‌, మాధవి, సూపర్‌వైజర్‌ రఫీ, రాహత్‌శ్రీధర్‌, ఏఎన్‌ఎంలు ఆశ కార్యకర్తుల పాల్గొన్నారు.

ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి

ప్రజా, విద్యార్థి సంఘాల డిమాండ్‌

తాండూరు టౌన్‌: ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్‌ చేసిందని దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని వామపక్ష ప్రజా, కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్‌ చౌక్‌లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత పేరుతో అమాయక గిరిజనులను, సానుభూతి పరులను హత్య చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మావోయిస్టు జాతీయ కార్యదర్శి కేశవరావును పట్టుకుని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారని ఆరోపించారు. ఈ ఆపరేషన్‌లో మృతి చెందిన మావోయిస్టులవి బూటకపు ఎన్‌కౌంటర్‌లేనని, వీరి మృతిపై సిట్టింగ్‌ జడ్జిచే విచారణ చేపట్టాలని కేఎన్‌పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రప్ప, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు అంజి, మహేష్‌, ఆనంద్‌, పకీరప్ప, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement