
● అయినా మేల్కోని విద్యాశాఖ ● అధికారుల పనితీరుపై తల్లిదం
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన ప్రతీసారి విద్యాశాఖ ఉన్నతాధికారులుఒకే మాట చెప్పారు.. పదిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యమని.. ఇందుకోసం పక్కా ప్రణాళికతో సాగుతున్నామని, మెరుగైన ఫలితాలు వస్తాయని ఊదరగొట్టారు.. కానీ వారి మాటలకు వాస్తవ పరిస్థితులకు ఎక్కడాపొంతన కుదరలేదు. ఇటీవల విడుదలైనటెన్త్ ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలవడం వీరి పనితీరుకు అద్దం పడుతోంది.
వికారాబాద్: తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా అట్టడుగున నిలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ పనితీరుపై తల్లి దండ్రులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో మన ప్రాంతానికి టాప్ ఫైవ్లో చోటుదక్కేది.జిల్లాల విభజన తర్వాత కరోనా బ్యాచ్లు మినహా ఒక్క సారి కూడా కనీస స్థానం దక్కించుకోలేక పోయింది. ఈ సారి ఏకంగా రాష్ట్రంలోనే చివరి స్థానానికి పడిపోయి అపఖ్యాతిని మూటగట్టుకుంది. విద్యాశాఖ పై మూడేళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నా దిద్దు బాటు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇంతజరుగుతున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
3,344 మంది ఫెయిల్
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో 12,846 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 9,502 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏకంగా 3,344 మంది ఫెయిల్ అయ్యారు. ఒక్క గణితం సబ్జక్టులోనే 2,639 మంది విద్యార్థులు తప్పారు. సైన్స్లో 1,474 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల్లో సైతం రాష్ట్ర సగటుకంటే తక్కువ ఉత్తీర్ణత రావడం విమర్శలకు తావిస్తోంది. గురుకులాల్లో మంచి ఫలితాలు రాగా మోడల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. విద్యాశాఖ ఘోర వైఫల్యాలను మూటగట్టుకుంది. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడం, బోధన సక్రమంగా లేకపోవడం, పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పూర్తిస్థాయి ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లోనూ ఫలితాలు దారుణంగా వచ్చాయి. అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉండి కూడా ఒకరిద్దరు మాత్రమే పాస్ కావడం సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోంది.
పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నా..
నవాబుపేట మండలం అక్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 23 మంది విద్యార్థులు ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పదో తరగతి పరీక్షలకు ఐదుగురు విద్యార్థులు హాజరు కాగా ఒక్కరు మాత్రమే పాసయ్యారు. ఇదే మండలంలోని నారెగూడ స్కూల్లో మొత్తం 13 మంది విద్యార్థులు ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ముగ్గురు విద్యార్థులు పది పరీక్షలు రాయగా ఒక్కరే పాసయ్యారు.
● పెద్దేముల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 102 మంది విద్యార్థులు.. ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పది పరీక్షలకు 16 మంది విద్యార్థులు హాజరు కాగా ఇద్దరే ఉత్తీర్ణత సాధించారు. ఇదే మండలంలోని తట్టెపల్లి స్కూల్లో 150 మంది విద్యార్థులు.. 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 20 మంది పరీక్షలు రాయగా ఏడుగురే పాసయ్యారు.
● తాండూరు మండలం జినుగుర్తి ఉన్నత పాఠశాలలో 200 మంది విద్యార్థులు.. 12 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 30 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా కేవలం 8 మంది మాత్రమే పాసయ్యారు.
● కుల్కచర్ల బాలురు ఉన్నత పాఠశాలలో 21 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ 98 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 30 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇదే మండలంలోని ఉప్పాయిపల్లి ఉన్నత పాఠశాలలో 56 మంది విద్యార్థులు.. 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 11 మంది పదో తరగతి పరీక్షలు రాయగా నలుగురు పాసయ్యారు. కుస్మ సముద్రం ఉన్నత పాఠశాలలో మొత్తం 68 మంది విద్యార్థులు.. ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. 15 మంది పది పరీక్షలకు హాజరు కాగా నలుగురు పాసయ్యారు.
● పూడూరు మండలం కోడుమూర్ ఉన్నత పాఠశాలలో 46 మంది విద్యార్థులు.. ఏడుగు రు ఉపాధ్యాయులు ఉన్నారు. ఎనిమిది మంది ఎగ్జామ్స్ రాయగా ముగ్గురే పాసయ్యారు.
● పరిగి జిల్లా పరిషత్ నంబర్ వన్ పాఠశాలలో 123 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 58 మంది మాత్రమే పాసయ్యారు. నంబర్ టూ పాఠశాలలో 58 మందికి గాను 23 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇదే మండలంలోని చిట్యాల్ ఉన్నత పాఠశాలలో 27 మంది పరీక్షలు రాయగా 9 మంది మాత్రమే పాసయ్యారు.
మొదటి స్థానంలో బొంరాస్పేట్ మండలం
జిల్లాలోని బొంరాస్పేట్ మండలం 93 శాతం ఫలితాలతో మొదటి స్థానంలో నిలవగా కుల్క చర్ల, పెద్దేముల్ మండలాలు 47 శాతం ఫలి తాలతో చివరి స్థానంలో నిలిచాయి. జిల్లాలో ఎనిమిది పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. ప్రైవేటు పాఠశాలలకు చెందిన 303 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.