
మళ్లీ మనమే లాస్ట్
పది ఫలితాల్లో జిల్లాకు 33వ స్థానం
వికారాబాద్: ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా మళ్లీ చివరి స్థానానికే పరిమితమైంది. గతేడాది సైతం ఇదే స్థానంలో నిలిచి 65 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 73.97 శాతంతో మెరుగైన ఫలితాలు సాధించారు. మూడేళ్ల క్రితం వరకు 24వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాదితో వరుసగా మూడో సారి అట్టడుగు స్థానానికి పడిపోయింది. అధికారులు మౌలిక సదుపాయాలంటూ పాఠశాలల చుట్టూ తిరిగుతూ విద్యార్థుల సామర్థ్యాలపై దృష్టి సారించడంలో విఫలమయ్యారనే అపవాదు మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో మొదటి స్థానం సాధించిన జిల్లా మహబూబాబాద్ 99.29 శాతం ఫలితాలు సాధించగా జిల్లా 26 శాతం వెనకబడి ఉంది. రాష్ట్ర సగటు 92 శాతం ఉండగా దానికన్నా 19 శాతం వెనకబడి ఉన్నాం. 32 వ స్థానంలో నిలిచిన అసిఫాబాద్ జిల్లా కంటే కూడా మనం 14 స్థానాలు వెనకబడి ఉండటం గమనార్హం. గతేడాది వరకు జీపీఏ రూపంలో ఫలితాలు ఇవ్వగా ఈ ఏడాది పాత పద్ధతిలో విద్యాశాఖ మార్కుల రూపంలో ఫలితాలు వెల్లడించింది. నవాబుపేట మండలానికి చెందిన గురుకుల పాఠశాల విద్యార్థి కార్తీక్ 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించి సత్తా చాటాడు.
73.97 శాతం ఉత్తీర్ణత
జిల్లాలోని 20 మండలాల నుంచి వార్షిక పరీక్షలకు 12,846 మంది విద్యార్థులు హాజరవగా.. 9,502 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో మొత్తం ఈ ఏడాది పరీక్షలకు హాజరైన వారిలో 3,344 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 73.97 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 78.14 శాతంతో బాలికలు మొదటి స్థానంలో నిలవగా 69.77 శాతంతో బాలురు అట్టడుగున నిలిచారు. రెండేళ్ల క్రితం పేపర్ లీకేజీ కారణంగా పోలీసులు, ఆయా శాఖల అధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. కొన్ని చోట్ల పోలీసులే విద్యార్థులను చెక్ చేశారు. రెండేళ్లుగా విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్ష లు రాయలేకపోవటం ఫలితాలపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది.