1,663 మందికి రూ.11.60 కోట్ల రుణాలు

కుల్కచర్ల: రైతు సంక్షేమమే తమ అభిమతమని డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘ కార్యాలయంలో శుక్రవారం వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల్కచర్ల ప్రాథమిక సహకార సంఘంలో 5,621 మంది క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్నారన్నారు. వీరిలో 1,663 మందికి రూ.11.60 కోట్ల రుణాలు అందజేశామని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లోనూ రైతులకు మేలు చేకూర్చే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సంఘాలన్నీ నష్టాల్లో ఉండేవని, సీఎం కేసీఆర్‌ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. అనంతరం సభ్యులకు వాచీలు అందజేశారు. సమావేశానికి వచ్చిన రైతులకు మండల వైద్యాధికారి వాజుద్దీన్‌ సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జెడ్పీటీసీ రాందాస్‌ నాయక్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నాగరాజు యాదవ్‌, సీఈఓ బక్కారెడ్డి, బీఆర్‌ఎస్‌ చౌడాపూర్‌ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కుల్కచర్ల సర్పంచ్‌ సౌమ్యారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాంలాల్‌, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top