
ఎంపీడీఓకు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు
నవాబుపేట: కాంగ్రెస్ సర్పంచులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కుట్రలు చేస్తున్నారని, సర్పంచులను ప్రలోభాలకు గురి చేసి పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆరోపించారు. మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో ఉపాధి హామీ పథకం కింద రూ.15 లక్షలతో సర్పంచ్ పద్మ సీసీ రోడ్డు వేయించారు. అయితే రోడ్డు పనులు పూర్తయ్యాక పనులు రద్దయినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికారులు ఇలావ్యవహరిస్తున్నారని, ఇందుకు నిరసనగా మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సీసీ రోడ్డును పనులు పూర్తి చేసిన తరువాత రద్దు చేయడం వెనుక ఎమ్మెల్యే కాలె యాదయ్య కుట్ర ఉందన్నారు. కాంగ్రెస్ సర్పంచులను ఇలా బెదిరించి పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలోకి రాని సర్పంచులకు నిధులు రాకుండా చేస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం.. చేవెళ్లలో యాదయ్య కుటుంబ ఈ తరహా పాలన సాగిస్తోందని అన్నారు. ఎస్సీలను రాజకీయంగా ఎదగనివ్వడం లేదన్నారు. లిక్కర్ స్కాంలో కవితను ఈడీ విచారణకు పిలిస్తే గగ్గొలు పెట్టిన ప్రభుత్వం మరి ఒక మహిళా సర్పంచ్ పనులు చేస్తే రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను ఎమ్మెల్యే లెటర్ ఇచ్చి రద్దు చేయించడంపై వారు మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ పరంగా బిల్లు చెల్లించకుంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా కలిసి సర్పంచ్కు డబ్బు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేకి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, ఆ విషయం మరిచి పోవదన్నారు. ఎమ్మెల్యే తీరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎస్ఐ భరత్భూషణ్ అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తించడంపై ఆయన మండిపడ్డారు. అనంతరం రోడ్డు పనులకు సంబంధించిన బిల్లు మంజూరు చేయాలని ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి ఏ మధుసూదన్రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు సీ సత్యనారాయణరెడ్డి, షాబాద్, చేవెళ్ల, మొహినాబాద్, నవాబుపేట మండలాల అధ్యక్షులు, నాయకులు వసంతం, భీం భరత్, దర్శన్, మధుసూదన్రెడ్డి, వెంకటయ్య, ప్రభాకర్రెడ్డి, కొండల్ యాదవ్, ఉపేందర్రెడ్డి, యాదయ్య, ప్రసాద్, సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పనులు పూర్తిచేశాక
రద్దు చేయడం దారుణం
కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా
అధ్యక్షుడు నర్సింహారెడ్డి
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట
కాంగ్రెస్ ధర్నా