
సూళ్లూరుపేటలో ఫ్లెక్సీలు చించివేసిన పోలీసులు
రైతులతో కలిసి కదం తొక్కిన వైఎస్సార్సీపీ నేతలు ఆర్డీఓ కార్యాలయాలకు రైతులతో కలిసి ర్యాలీ తిరుపతిలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసన వరి కంకులు, యూరియా బస్తాల ఫ్లెక్సీలతో ర్యాలీ గూడూరులో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు సూళ్లూరుపేటలో పోలీసుల ఓవరాక్షన్
తిరుపతిలో నిరసన ర్యాలీగా వస్తున్న భూమన అభినయ్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి, మేయర్ శిరీష, చంద్రమౌళిరెడ్డి పాటు రైతులు, పార్టీ శ్రేణులు (ఇన్సెట్) వరి పైరు, యూరియా మూటలతో ర్యాలీగా వస్తున్న పార్టీ శ్రేణులు, రైతులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జిల్లాలో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి కదం తొక్కారు. ఎరువుల బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా నియంత్రించాలని డిమాండ్ చేశారు. వేరుశనగ విత్తనాలు, వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, పంటలకు ఉచిత బీమా అమలు చేయాలంటూ మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రాలు సమర్పించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాళ్లు పట్టుకుంటాం.. సమస్యలు పరిష్కరించండయ్యా
తిరుపతి నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద వినూత్న తరహాలో నిరసన తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు వరి కంకులు, యూరియా బస్తాల ఫ్లెక్సీలు చేతపట్టి అన్నమయ్య కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ముందు ఖాళీ స్థలంలో రైతు భరోసా కేంద్రం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ఖాళీగా కూర్చుంటే ఎరువు, విత్తనాల కోసం రైతులు వారి కాళ్లుపట్టుకుని వేడుకుంటారు. అయితే ఎరువులు, విత్తనాలు, పథకాలు లేవంటూ అధికారుల వేషధారణలో ఉన్న వారు సమాధానం ఇస్తే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వినూత్నంగా నిరసన తెలియజేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించి రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ విన్నవించారు. కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు సమస్యలు పరిష్కరించండి
శ్రీకాళహస్తిలో తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, సత్యవేడు నియోజక వర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాళహస్తి, సత్యవేడుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల, రైతులు శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న అధికారిణికి వినతి పత్రం సమర్పించారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యల గురించి భూమన కరుణాకరరెడ్డి ఆమెకు వివరించారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, సత్యవేడుకు చెందిన బీరేంద్రవర్మ, మాధవి పాల్గొన్నారు.
అడుగడుగునా అడ్డంకులు
గూడూరు, వెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు మెరుగ మురళీధర్, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరుకు రైతులు భారీగా తరలివచ్చారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకోవడంతో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు గూడూరు టవర్ క్లాక్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతుండటంతో అంతాకలిసి నేరుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవటంతో కార్యాలయ ఏవోకు వినతి పత్రం ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఎవరికి వారు హోలీ క్రాస్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని ఫ్లెక్సీలను చించివేశారు. ఆ సమయంలో కొంత సేపు పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. రైతు సమస్యలపై ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సూళ్లూరుపేటలో ఫ్లెక్సీలు చించివేసిన పోలీసులు

సూళ్లూరుపేటలో ఫ్లెక్సీలు చించివేసిన పోలీసులు

సూళ్లూరుపేటలో ఫ్లెక్సీలు చించివేసిన పోలీసులు

సూళ్లూరుపేటలో ఫ్లెక్సీలు చించివేసిన పోలీసులు