
తిరుపతిలో ‘చెప్కో’ బృందం పర్యటన
తిరుపతి తుడా : తిరుపతి నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రజారోగ్య, పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ (చెప్కో) అడ్వైజరీ కమిటీ బుధవారం నగరంలో పర్యటించింది. కమిటీ సభ్యులు చౌరాసియా, అమిత్ కమిషనర్ మౌర్యతో కలిసి రేణిగుంట రోడ్డులో భూమి కుంగిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సమస్య పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలను నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. అలాగే తూకివాకం వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. నగరం నుంచి మురుగునీరు వస్తున్న విధానం, శుద్ధి చేయడం, పరీక్షలు చేసిన అనంతరం నీటిని తిరిగి వినియోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. శుద్ధి చేసిన నీటిని కొంత భాగం ల్యాంకో ఫాక్టరీకి, కొంత నీటిని చుట్టుపక్కల వ్యవసాయ భూములకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రైతులతో మాట్లాడి పలు విషయాలు ఆరా తీశారు. మురుగునీటి శుద్ధి విధానం బాగుందని ఈ విధానాన్ని డాక్యుమెంట్గా రూపొందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్యామ్సుందర్, ఎంఈ గోమతి, డీఈ రమణ, ఏఈ శిల్ప, మస్తాన్ పాల్గొన్నారు.
త్రిబుల్ ఐటీకి గురుకుల విద్యార్ధులు
సత్యవేడు: జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన ముగ్గురు విద్యార్థులు ఇడుపులపాయ త్రిబుల్ ఐటీకి ఎంపికై నట్లు ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివిన నారాయణవనం తంబూరు గ్రామానికి చెందిన ఉదయ్కుమార్, వరదయ్యపాళానికి చెందిన జస్వంత్, శ్రీకాళహస్తికి చెందిన బెన్హర్బాబు ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
ట్యాలీపై అవగాహన అవసరం
తిరుపతి సిటీ: నేటి ఆధునిక సాంకేతిక యుగంలో విద్యార్థులు ఉపాధి అవకాశాల కోసం ట్యాలీ సాఫ్ట్వేర్పై అవగాహన పెంచుకోవాలని హిపోక్లౌడ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ ప్యాకల్టీ రాంబాబు తెలిపారు. మహిళా వర్సిటీ ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ట్యాలీ ప్రైమ్ విత్ జీఎస్టీపై వర్క్ షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారత్లో అన్ని రంగాల్లోనూ అకౌంటింగ్ పర్పస్ కోసం ట్యాలీ ప్యాకేజ్ను విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు. కంప్యూటరైజ్డ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇన్వెంటరీ మాస్టర్ను సృష్టించడం, పన్నుల నిర్ధారణ వంటి వాటిలో ట్యాలీ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నాను. ఈ వర్క్షాపులో ప్రొఫెసర్ బి విజయలక్ష్మీ, ఎంబీఏ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

తిరుపతిలో ‘చెప్కో’ బృందం పర్యటన