
పట్టించుకునేవారే లేరు
తిరుపతి అర్బన్ : జిల్లాలో అంగన్వాడీ పాఠశాలలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దింది. ప్రీ స్కూళ్ల పేరుతో పిల్లలకు మెరుగైన విద్యాబోధనను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే నాణ్యమైన పోషకాహార సరుకులను చిన్నారులతోపాటు బాలింతలు, గర్భిణులకు పంపిణీ చేసింది. దీంతో అంగన్వాడీ బడుల్లో విద్యార్థుల సంఖ్యల గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగవాడీ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. పాలకులు పట్టించుకోకపోవడంతోపాటు అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో పూర్తిగా గాడి తప్పింది. విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోగా, నాసిరకం సరుకులను బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్నారు. సివిల్ సప్లయి విభాగం నుంచి పురుగు పట్టిన సరుకులు వస్తున్నప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నించేందుకు ధైర్యం చేయలేని దుస్థితి దాపురించింది. చేసేది లేక వచ్చిన నాణ్యత లేని పోషకాహారాన్నే పంపిణీ చేసి చేతులు దులుపుకోవాల్సి వస్తోంది. ఈ మేరకే రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి బీసీ బాలుర వసతిగృహంలో నాసిరకం సరుకులతో చేసిన అల్పాహారం తిని 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
కేంద్ర పథకం.. విఫలం
కేంద్రప్రభుత్వం పోషణ్ వాటిక పథకం కింద ఒక్కో అంగన్వాడీ స్కూల్కు రూ.10 వేలను ఇటీవల మంజూరు చేసింది. ఆ నిధులతో అంగన్వాడీ పాఠశాల ప్రాంగణంలోనే ప్రకృతి సేద్యం ద్వారా ఆకు కూరలు, కూరగాయలు సాగు చేసి వాటిని వండి పిల్లలకు వడ్డించాల్సి ఉంది. ఈ క్రమంలోనే జిల్లాలోని తొలి విడతలో 475 స్కూళ్లకు రూ.47.50లక్షలు విడుదల చేశారు. అయితే పట్టించుకునేవారు లేక ఈ పథకం పూర్తిగా విఫలమైంది. అధికారుల అలసత్వంతోనే పిల్లలకు చేకూరాల్సిన ప్రయోజనం దూరమైంది.
అరకొరగా విదిలిస్తూ..
అంగన్వాడీ పాఠశాలల్లో పిల్లలతోపాటు గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న కందిపప్పుకు కూటమి ప్రభుత్వం కోతలు పెట్టింది. అధికారంలోకి వచ్చిన తొలి ఆరునెలల పాటు కందిపప్పును పూర్తిగా అందించలేదు. దీంతో పంపిణీ చేయాల్సిన పౌష్టికాహారం ప్రశ్నార్థకంగా మారింది.ఆ తర్వాత సరఫరా చేసిన పప్పు దినుసుల్లో నాణ్యత కరువైంది. పురుగులు పట్టిన పప్పులు ఇవ్వడంతో అంగన్వాడీ సిబ్బందికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళితే ఎండలో పెట్టి.. ఆరబెట్టి.. తర్వాత వండి పిల్లలకు వడ్డించేయండి అంటూ చేతులు దులిపేసుకున్నట్లు తెలిసింది. ఈ విధమైన నాసిరకం సరుకులను తిని పిల్లలు, బాలింతలు, గర్భిణులు రోగాల బారిన పడుతున్నట్లు పెద్దసంఖ్యలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజీ పడకూడదు
అంగన్వాడీ స్కూళ్లలో చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ల విషయంలో రాజీ పడకూడదు. న్యాయంగా వారికి అందాల్సిన సరుకులు ఇవ్వాలి. నాణ్యతలేని కోడిగుడ్లు, నాసిరకం కందిపప్పు అందించడం దారుణం. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారులు సైతం నిరంతరం పర్యవేక్షించాలి. నాణ్యత లేని సరుకులు వస్తే వాటిని తిప్పి పంపాలి.
– నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి
నాణ్యత ఉండడం లేదు
అంగన్వాడీ పరిధిలో నిబందనల మేరకు సరుకుల్లో నాణ్యత ఉండడం లేదు. కోడిగుడ్ల టెండర్ సమయంలో ఓ సైజ్ చెబుతున్నారు.. పంపిణీ చేసే సైజ్ చాలా చిన్నగా ఉంటోంది. కందిపప్పుతోపాటు ఇతర సరుకులు కూడా నాసికరంగా ఉంటునానయి. ఇలాంటివి తింటే చిన్నపిల్లలకు మంచిది కాదు. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి.
– జయచంద్ర, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
కక్కుర్తి తగదు
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పంపిణీ చేసే సరుకుల విషయంలో కక్కుర్తి తగదు. పురుగు పట్టిన సరుకులు పంపిణీ చేయడం అన్యాయం. భవిష్యత్ సమాజానికి కూడా ఇది మంచిది కాదు. నాణ్యత లేని సరుకులను ఆహారంలో తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది. దీనిపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి.
– వేణు, సీపీఎం నగర కార్యదర్శి
అలసత్వం వహిస్తే చర్యలు
అంగన్వాడీ పాఠశాల పరిధిలోని పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు క్షేత్రస్థాయిలో నాణ్యమైన సరుకులను అందించేందుకు కృషి చేస్తున్నాం. ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేస్తాం. కందిపప్పుతోపాటు కోడిగుడ్లు, ఇతర సరుకుల విషయంలోను ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. పాఠశాలలపై పర్యవేక్షణ పెంచడంతోపాటు ప్రత్యేక నిఘా పెడతాం. ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం. సివిల్ సప్లయి అధికారులతోనూ మాట్లాడతాం. నాణ్యత విషయంలో రాజీ లేకుండా పనిచేస్తాం. – వసంతబాయి, ఐసీడీఎస్ పీడీ, తిరుపతి
గత వైఎస్సార్సీపీ హయాంలో పకడ్బందీగా..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని పకడ్బందీగా పంపిణీ చేసేవారు. గర్భిణులు, బాలింతలకు 15 రోజులకు ఒకసారి పోషకాహార కిట్లు అందించేవారు. అందులో నెలకు సరిపడా బియ్యం, కందిపప్పు కేజీ, ఆయిల్ అర కేజీ, రాగిపిండి 2 కేజీలు, అటుకులు కేజీ, ఖర్జూరం పావు కేజీ, చిక్కీలు పావుకేజీ, బెల్లం పావుకేజీ, పాలు 5 లీటర్లు, 25 గుడ్లు చొప్పున ఇచ్చేవారు. ఆ పథకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం బాల సంజీవనిగా పేరు మార్చింది. అయితే తూతూమంత్రంగా సరుకులు అందించి సరిపెట్టేస్తోంది.
గాడితప్పిన అంగన్వాడీ కేంద్రాలు
నాసిరకం సరుకులు
సరఫరా చేస్తున్న ప్రభుత్వం
పూర్తిగా దెబ్బతిన్న దినుసుల పంపిణీ
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
రోగాల బారిన పడుతున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులు
క్షేత్రస్థాయిలో అవసరాలకు అనుగుణంగా సరుకులు అంగన్వాడీ కేంద్రాలకు అందడం లేదు. ప్రధానంగా సివిల్ సప్లయి నుంచి ఏం సరుకులు వస్తున్నాయి..? వాటి నాణ్యత ఎలా ఉంది..? నాసిరకం సరుకును పంపిణీ చేస్తే పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వాటిల్లే అనర్థాలేంటి..? అనే అంశాలను పట్టించుకునే అధికారులే కరువయ్యారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెప్పిన పనులు చేస్తే చాలనుకునే దుస్థితిలో పడిపోయారు. ఈ క్రమంలోనే అంగన్వాడీ కేంద్రాలపై ఎవరూ దృష్టి పెట్టడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయాలకే అధికారులు పరిమితమవుతున్నారని, జిల్లా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడంలోనే నిమగ్నమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు సాధారణంగా బియ్యం, కందిపప్పు, వంట నూనె, పాలు, కోడిగుడ్లు, బాలామృతం సరఫరా చేయాల్సి ఉంది. అయితే అవన్నీ వస్తున్నాయా..? అందులో నాణ్యత పరిస్థితి ఏంటనే విషయాలను అధికారులు విస్మరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.
కుళ్లిన కోడిగుడ్లు
అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తున్న కోడిగుడ్లలో నాణ్యత కరువైంది. కాంట్రాక్టర్లు కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ప్రతి నెలా 25 గుడ్లు చొప్పున అందిస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో నెలకు 26లక్షల కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఈ స్థాయిలో కోడిగుడ్లు కొనుగోలు చేస్తున్నప్పటికీ అధికారులు పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాణ్యతలేని, ప్రమాణాల స్థాయి లేని గుడ్లు సరఫరా చేస్తున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నించే ధైర్యం లేక అంగన్వాడీ వర్కర్లు సర్దుకుపోతున్నారు. తమ కేంద్రానికి వచ్చిన వాటినే పంపిణీ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏర్పేడు మండలం చెన్నంపల్లె అంగన్వాడీ సెంటర్లో కుళ్లిపోయిన కోడిగుడ్లను సరఫరా చేసిన సంగతి తెలిసిందే.

పట్టించుకునేవారే లేరు

పట్టించుకునేవారే లేరు

పట్టించుకునేవారే లేరు

పట్టించుకునేవారే లేరు

పట్టించుకునేవారే లేరు

పట్టించుకునేవారే లేరు