
కార్పొరేషన్ నిధులతో ‘స్మార్ట్ సిటీ’
తిరుపతి అర్బన్: తిరుపతి స్మార్ట్ సిటీ పనులకు కార్పొరేషన్ నిధులు వినియోగించుకోవాలని స్మార్ట్ సిటీ చైర్మన్, కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ కింద పురోగతిలోని 14 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్, సోలార్ ప్రాజెక్టు సత్వరం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో స్మార్ట్ సిటీ సీఈఓ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్ రావు, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ డాక్టర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ రమ పాల్గొన్నారు.
పెండింగ్ అర్జీలపై సమీక్ష
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్పై కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించారు. పెండిగ్ అర్జీల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని కోరారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఈ మేరకు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్ఓ నరసింహులు పాల్గొన్నారు.