
30 నుంచి శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు
చంద్రగిరి:శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యా ణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం చేపడతారు. అనంతరం 7 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనం నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు హనుమంత వాహనం ఉంటాయి. జూలై 2వ తేదీ ఉదయం స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ చేపడతారు. రాత్రి 7 గంటలకు స్వామి వారి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. చివరిరోజు జూలై 3వ తేదీ ఉదయం పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. వైభవోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.