
నీట్లో విద్యార్థుల ప్రతిభ
తిరుపతి ఎడ్యుకేషన్ : విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన నీట్ (యూజీ) ఫలితాలు విడుదల అయ్యాయి. దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. మే నెల 4న జరిగిన నీట్ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో తిరుపతి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. అభిప్రాయాలు..వారి మాటల్లోనే..
నెఫ్రాలజిస్ట్ కావడమే లక్ష్యం
కిడ్నీ వ్యాధులకు సంబంధించిన నెఫ్రాలజిస్ట్ కోర్సును అభ్యసించి మెరుగైన వైద్య సేవలందించాలన్నదే నా లక్ష్యం. మాది తిరుపతి.. నాన్న సతీష్చంద్ర గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడు , అమ్మ పావనీ నెఫ్రాలజిస్ట్ వైద్యురాలు. నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఓపెన్ విభాగంలో 934వ ర్యాంకు, కేటగిరి విభాగంలో 582వ ర్యాంకు సాధించా.
– జ్ఞానీషారెడ్డి, నీట్ ర్యాంకర్, తిరుపతి