
దివ్యదర్శనం..దైవాధీనం
సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో తిరుపతికి తరలివచ్చే యాత్రికులకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కష్టతరంగా మారింది. భక్తి శ్రద్ధలతో కాలినడకన శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లాలనుకునే భక్తులు ఇకపై దివ్యదర్శనం టోకన్లు పొందడం దైవాధీనంగా మారుతోంది. టీటీడీ తీసుకుంటున్న పలు నిర్ణయాలు భక్తుల పాలిట శాపాలుగా మారుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ముందుస్తుగా ఎలాంటి ప్రచారం లేకుండా అనూహ్యంగా చేపట్టే మార్పులు ఇబ్బందికరంగా పరిణమిస్తాయని స్పష్టం చేస్తున్నారు.
తిరుపతి అన్నమయ్య సర్కిల్: శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా మార్పుచేశారు. శ్రీవారి మెట్టు వద్ద నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్కి మారుస్తూ టీటీడీ చర్యలు చేపట్టింది. ఈమేరకు ఈ నూతన కౌంటర్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
పెరగనున్న రద్దీ
తిరుపతి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవారి మెట్టు వద్దకు యాత్రికులు చేరుకుని దివ్యదర్శనం టోకన్లు పొంది అక్కడి నుంచి నేరుగా కాలినడకన తిరుమలకు చేరుకునేవారు. అయితే అనూహ్యంగా టోకన్ జారీ కౌంటర్లను అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్కు మార్పుచేశారు. అసలే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద అత్యధిక సంఖ్యలో యాత్రికుల రద్దీ ఉంటుంది. అలిపిరి నుంచి కాలినడక వెళ్లే వారు ఒకవైపు, అదే సమయంలో శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్లే భక్తులు దివ్యదర్శనం టోకెన్ల కోసం ఇక్కడికి చేరుకోవడంతో రద్దీ మరింత పెరిగి కొత్త సమస్యలు తలెత్తే అవకాశముంది.
ఊహించని పరిణామాలకు ఆస్కారం
దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ లభ్యత మేరకు అనే విషయం భక్తులకు ప్రశ్నార్ధకం కానుంది. శ్రీవారి మెట్టు చేరుకుని అక్కడి నుంచి వ్యయ ప్రయాసలతో అలిపిరి వద్దకు వచ్చి టోకెన్ పొందలేని వారు నిరుత్సాహానికి గురికావల్సిందే. ముందు వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత ప్రాతిపదికన టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో భక్తుల మధ్య పోటీతత్వం ఏర్పడి ఊహించని పరిణామాలు చోటు చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. అలిిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద నిర్దేశించిన కౌంటర్లలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణలో వారి భద్రత, రాక పోకల్లో ఉత్పన్నమయ్యే ట్రాఫిక్ సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.
శ్రీవారి మెట్టు మార్గంలో
టోకెన్ జారీ కేంద్రం మార్పు
అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో
నూతన కౌంటర్లు ప్రారంభం
టీటీడీ నిర్ణయంతో భక్తుల అయోమయం
ముందస్తు ప్రచారం లేక అవస్థలు
కాలినడక తప్పని తిప్పలు
శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శనం టోకెన్ జారీ కేంద్రాల మార్పు సమాచారం తెలియని భక్తులకు తిప్పలు తప్పవు. . టోకెన్ జారీ కేంద్రాల మార్పు గురించి తెలియని వారు మొదట శ్రీవారి మెట్టుకు చేరుకుంటారు. అక్కడికి తిరుపతి నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంది. విషయం తెలుసుకుని తిరిగి 15 కిలోమీటర్ల దూరంలోని అలిపిరి వద్ద రావాలి. టోకెన్లు పొందిన తర్వాత మళ్లీ 15 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీవారి మెట్టు వద్దకు చేరుకోవాలి. దీంతో అదనంగా ప్రయాణ ఖర్చు పెరిగే ప్రమాదముంది.

దివ్యదర్శనం..దైవాధీనం

దివ్యదర్శనం..దైవాధీనం