
అవార్డులతో ప్రతిభకు ప్రోత్సాహం
తిరుపతి కల్చరల్ : ప్రతిభ గల విద్యార్థులు ప్రోత్సహించేందుకే ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. పదోతరగతి, ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు అందించారు. మంత్రి మాట్లాడుతూ పేదరికం కారణంగా పిల్లలకు చదువుకు దూరం కాకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ఏపీని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ అమలు చేస్తోందని వెల్లడించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యావ్యవస్థను అద్భుతంగా తయారుచేసేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని వివరించారు. అందులో భాగంగానే ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకే షైనింగ్ స్టార్స్ అవార్డులను అందిస్తున్నట్లు వెల్లడించారు. సర్కారు పాఠశాలల్లో చదువుకుని ఉత్తమ మార్కులు సాధించి అవార్డు అందుకున్న విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం 207 మంది పదోతరగతి విద్యార్థులు, 40 మంది ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. అలాగే రూ.20వేల చొప్పున నగదు, మెడల్స్ అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, కోనేటి ఆదిమూలం, నేతలు సుగుణమ్మ, పసుపులేటి హరిప్రసాద్, డీఈఓ కేవీఎన్ కుమార్, సర్వశిక్ష అభియాన్ సీఎంఓ సురేష్ పాల్గొన్నారు.