
అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పీజీఆర్ఎస్ నిర్వహించారు. జేసీతోపాటు డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, సుధారాణి, రోజ్మాండ్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. కలెక్టరేట్లో 242 అర్జీలు వచ్చాయని వెల్లడించారు. అందులో రెవెన్యూ సమస్యలపై 129, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్–9, పంచాయతీ రాజ్ –14, పోలీస్ శాఖ –10 మిగిలిన విభాగాల్లో కొద్ది పాటి అర్జీలు వచ్చాయని వివరించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే దిశగా చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు.
పోలీస్ గ్రీవెన్స్కు 94 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్న్ రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి