
పేరూరులో రూ.20 కోట్ల భూమి కబ్జా
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబరు 529లోని ఎకరా భూమి ఆక్రమణకు గురైంది. తిరుపతి– చంద్రగిరి మార్గంలోని స్టాఫ్ క్వార్టర్స్ వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఈ భూమి విలువు ప్రస్తుతం మార్కెట్లో రూ.20 కోట్ల వరకు ఉంది. దీనిపై రెండు నెలల క్రితమే సాక్షిలో వార్త ప్రచురితం కావడంతో ఆక్రమణదారులు కొంతకాలం పనులు నిలుపుదల చేశారు. ఆదివారం మళ్లీ ఆక్రమిత భూమిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే భూమిపై కోర్టును ఆశయ్రించిన ఓ మహిళ అక్కడకు వెళ్లి పనులు అడ్డుకునేందుకు విఫలయత్నం చేసింది. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత ఒత్తిడి కారణంగానే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.