
అలిపిరికి టోకెన్ల జారీ కేంద్రం
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే దివ్యదర్శనం భక్తుల సౌకర్యార్ధం దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్కు మార్చినట్లు టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. శనివారం సాయంత్రం ఈఓ భూదేవి కాంప్లెక్స్, అలిపిరి టోల్ ప్లాజాలను పరిశీలించారు. శ్రీవారి మెట్టు వద్ద భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారనే ఫిర్యాదులు రావడంతో తాత్కాలికంగా శుక్రవారం సాయంత్రం నుంచి మార్చామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో రోజుకు సరాసరి 5 వేల టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. శ్రీనివాస మంగాపురంలో టోకెన్లు జారీ చేసేందుకు ఆర్కియాలజీ శాఖ అనుమతి రాగానే అక్కడ టోకెన్లు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సీవీ అండ్ ఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ హర్షవర్థన్ రాజు, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు.