
పోలీసులకే రక్షణ లేదు!
● బీహార్ను తలపిస్తున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అరాచకాలు ● కానిస్టేబుల్పై దాడి ఘటన లో బాధ్యులపై చర్యలు తీసుకోండి ● విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి డిమాండ్
శ్రీకాళహస్తి : మనం ప్రజాసామ్య దేశంలోనే ఉన్నామా..? నియంత పాలనలో బతుకుతున్నామా..? అని అనుమానం కలుగుతోందని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి డ్రైవర్.. పోలీస్ కానిస్టేబుల్ అన్వర్ బాషాపై దాడి చేయించిన ఘటనపై ఆయన మాట్లాడారు. అధికార పార్టీలో ఉండి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ను బలవంతంగా పిలిపించి కొట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. శ్రీకాళహస్తి రూరల్ సీఐ దగ్గరుండి కానిస్టేబుల్ను తీసుకెళ్లి ఎమ్మెల్యే ముందు నిలబెట్టి కొట్టించడం చూస్తుంటే రక్షణ వ్యవస్థ ఎలా దిగజారిందనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు.
డీఎస్పీ సమాధానం చెప్పాలి
బాధ్యతాయుతమైన డీఎస్పీ స్థానంలో ఉన్న అధికారి అలాంటి ఘటనలేవీ జరగలేదని బుకాయించడం.. కాసేపటికే ఎస్పీ కార్యాలయం నుంచి ఘటన జరిగింది వాస్తవమే కానీ క్షమాపణ చెప్పించలేదు... అని అధికారిక ప్రకటన ఇవ్వడంపై డీఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకుంటారు కదా.. మరి ఈరోజు శ్రీకాళహస్తిలో ఓ కానిస్టేబుల్ పై దాడి జరిగింది. దీనిపై కానిస్టేబుల్కు ఏ విధమైన న్యాయం చేస్తారో ప్రజలకు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మధు సూదన్రెడ్డి డిమాండ్ చేశారు. విలేకరుల పైన గత నెలలో దాడి చేశారనీ, ఈరోజు పోలీసులపైన దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టి పోలీసు వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీఐపై చర్యలు తీసుకొని కానిస్టేబుల్పై దాడిచేసిన వారిని శిక్షించాలని కోరారు. శ్రీకాళహస్తిలో ఏడాది కాలంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై 270 అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఎమర్జెన్సీ రోజులను కూటమి పాలన గుర్తుకు తెస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు.