
‘పది’ పరీక్షల నిర్వహణలో విఫలం
తిరుపతి రూరల్ : పదో తరగతి పరీక్షల నిర్వహణలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిందని వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి చేరుకున్న ఆయన ఓ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల తీరని నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో 6.14 లక్షల మంది విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించలేకపోవడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం తన తప్పిదాన్ని అంగీకరించి ఎలాంటి ఫీజు లేకుండా రీవాల్యుయేషన్ చేయించాలన్నారు. జవాబు పత్రాలు దిద్దడంలో చోటు చేసుకున్న తప్పులకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుల్రెడ్డి, వైవీపాళెం పార్టీ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, చంద్రగిరి నియోజక వర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్రెడ్డి, కుప్పం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్, విద్యార్థి విభాగం నుంచి వచ్చిన వివిధ మండలాల అధ్యక్షులు హరి, వినోద్, యశ్వంత్, రఫి, ఓంప్రకాష్రెడ్డి, రాజారెడ్డి, చరణ్రెడ్డి, జగన్ రెడ్డి ఉన్నారు.