
పేదల స్థావరాలపై ప్రతాపం
ఏర్పేడు: శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులోని పేదలపై టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. బుధవారం గ్రామానికి చెందిన 30మంది కుండలు తయారు చేసుకునే పేదలు బంకమట్టి నిల్వ చేసుకున్న స్థావరాలను టీడీపీ నేతలు ధ్వంసం చేసి స్థలాన్ని జేసీబీతో చదును చేశారు. స్థానికుల కథనం మేరకు.. గ్రామశివార్లలో ప్రభుత్వ భూమి రెండెకరాలు ఉంది. ఈ స్థలంలో దశాబ్దాల తరబడి కుమ్మరులు బంకమట్టి తెచ్చి అక్కడే నిల్వ చేసుకుని కుండలను తయారుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు కక్షపూరితంగా జేసీబీతో చదును చేసేశారు. బాధితులు మాట్లాడుతూ తాము నిల్వ చేసుకున్న మట్టినంతా పల్లపు ప్రాంతాల్లోకి తోసి చదును చేశారని, రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని వాపోయారు. ఉపాధి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.