
శ్రీహరి బస్టాండ్ కూల్చివేతకు సన్నాహాలు
తిరుపతి అర్బన్ : తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ప్రాంగణంలోని శ్రీహరి బస్టాండ్లో మొదటి ఐదు ప్లాట్ఫామ్లను కూల్చేందుకు టెండర్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. చిత్తూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్కు టెండర్ దక్కింది. కూల్చివేతకు రూ.13లక్షలు కేటాయించారు. తిరిగి అదే స్థలంలో రేకులతో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి రూ.45 లక్షలు మంజూరు చేశారు. ఆ టెండర్ను ఈ నెలాఖరులో ఖరారు చేయనున్నారు. ప్రధానంగా కూల్చడానికి నిర్ణయించిన ప్రాంతంలో ఐదు ప్లాట్ఫామ్లతోపాటు 4 దుకాణాలు, ఓ మరుగుదొడ్డి సెంటర్, కార్గో సెంటర్, రిజర్వేషన్ కార్యాలయం, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ఏటీఎం)కార్యాలయం ఉన్నాయి. వీటిని ఏ ప్రాంతంలోకి మార్చాలనే అంశంపై ఆర్టీసీ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలన చేపట్టారు. అదే ప్రాంతంలోని ఏడుకొండల బస్టాండ్ పక్కనే టీటీడీ వారు దర్శన టిక్కెట్ల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఆ కౌంటర్ను ఆర్టీసీ కార్గోకు వినియోగించాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ కౌంటర్ను శ్రీనివాస బస్టాండ్లో ఖాళీగా ఉన్న రెండు దుకాణాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఏటీఎం కార్యాలయం సైతం శ్రీనివాస బస్టాండ్లోని ఓ దుకాణంలోకి మార్పు చేయాలని చూస్తున్నారు. అలాగే ప్రయాణికులకు కల్పించాల్సిన వసతులపై నివేదిక రూపొందించేందుకు ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, డీఎం బాలాజీ, ఏఓ షెషబాన్, ఏటీఎం డీఆర్ నాయుడుతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 10న నివేదికను డీపీటీఓ వెంకట్రావ్కు అందించనున్నారు. అనంతరం ఈ నెల 15 నుంచి శ్రీహరి బస్టాండ్ కూల్చివేత పనులు చేపట్టనున్నారు.
● 15 నుంచి పనులు మొదలు?