భక్తుల భద్రతకు భరోసా | - | Sakshi
Sakshi News home page

భక్తుల భద్రతకు భరోసా

Jun 4 2025 12:46 AM | Updated on Jun 4 2025 12:46 AM

భక్తుల భద్రతకు భరోసా

భక్తుల భద్రతకు భరోసా

● చోరీల కట్టడికి ప్రత్యేక నిఘా బృందం ● విష్ణునివాసం, శ్రీనివాసం వద్ద నిరంతర పర్యవేక్షణ ● పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసులు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌ : తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు భద్రతా పరంగా భరోసా కల్పించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రధానంగా భక్తులు బస చేసే విష్ణునివాసం, శ్రీనివాసం సముదాయాల వద్ద చోరీల కట్టడిపై దృష్టి సారించారు. ఇటీవల భక్తుల సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు అపహరణకు గురవుతున్న నేపథ్యంలో పకడ్బందీగా నిఘా పెట్టారు. విష్ణునివాసం కాంప్లెక్స్‌కు కూత వేటు దూరంలోనే ఈస్ట్‌ పోలీసుస్టేషన్‌, రైల్వేస్టేషన్‌ వద్ద పోలీసు కంట్రోల్‌ పాయింట్‌ ఉంది. ఈ ప్రాంతం తరచూ యాత్రికులతో రద్దీగా ఉంటుంది. దీంతో ఒకవైపు వాహనాల రాకపోకలు, మరోవైపు ఆటోలు, ద్విచక్ర వాహన చోదకులు, పాదచారుల తాకిడికి ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలో దొంగలను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. అప్రమత్తంగా ఉన్నప్పటికీ దొంగలు విష్ణునివాసంలోకి వెళ్లి భక్తులతో పాటు కలసిపోయి చార్జింగ్‌ పెట్టిన సెల్‌ఫోన్లను తస్కరించేస్తున్నారు. విష్ణు నివాసంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ హల్‌చల్‌ చేస్తున్నారు.

స్పందించిన ఎస్పీ

విష్ణునివాసం, శ్రీనివాసం సముదాయాలలో 15 రోజులుగా జరుగుతున్న సెల్‌ఫోన్ల వరుస చోరీలపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజు స్పందించారు. సెల్‌ఫోన్లు అపహరించేవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని డీఎస్పీ భక్తవత్సలానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీఐ శ్రీనివాస్‌ తన బృందంతో విష్ణునివాసం, శ్రీనివాసం సముదాయాల వద్ద ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరణ యంత్రం ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం సెల్‌ఫోన్ల దొంగతనాలకు పాల్పడిన 15 మందిని గుర్తించి అదుపులోకి తీసుకుని వారి నుంచి 15 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన భక్తులకు సెల్‌ఫోన్లను అందించారు. నిందితులు తమిళనాడు, తిరుపతి, వైఎస్సార్‌ కడప జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

మరో 30 సీసీ కెమెరాల ఏర్పాటు

విష్ణునివాసంతో పాటు శ్రీనివాసం సముదాయాలలో సీసీ కెమెరా పర్యవేక్షణ లేని ప్రదేశాలను గుర్తించి అదనంగా 30 కెమెరాలను అమర్చాలని పోలీసులు నిర్ణయించారు. అపరిచితులు, అప్పటిప్పుడు కొత్తగా పరిచయం చేసుకునే వారితో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు మైకు ద్వారా సూచనలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement