
ప్రభుత్వ భూములు అమ్మేస్తున్న.. డిప్యూటీ తహసీల్దారుపై చర
● అసలైన ఉద్యోగం పక్కనబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం ● భూ ఆక్రమణలకు అసలైన సూత్రధారి డిప్యూటీ తహసీల్దారే ● కలెక్టర్కు విన్నవించిన తిరుపతి రూరల్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ తహసీల్దారు కార్యాలయంలో ప్రధాన డిప్యూటీ తహసీల్దారు గా విధులు నిర్వహిస్తున్న మోహన్ అసలైన ఉద్యోగం వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారని తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్ర మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ను కలిసి ఆయన భాగోతాన్ని వివరించారు. ఇంకా ఏం చెప్పారంటే.. మండలంలోని అన్ని గ్రామాల్లో తన ద్విచక్ర వాహనంపై ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ విలువైన ప్రభుత్వ భూములు, కాలువలు, కుంటలు, బంజరు భూములు, రెవెన్యూకు సంబంధం లేని మఠం భూములను సైతం పరిశీలించి.. ఆక్రమణదారులకు ధారాదత్తం చేస్తున్నాడని ఆరోపించారు. ఆ తరువాత భూములు ఆక్రమించిన అక్రమార్కులతో కలసి ఆ భూములను అడ్డదారిలో అమ్మేసి 25 శాతం వాటా తీసుకుంటున్నారని వివరించారు. ఒక బాధ్యత గల రెవెన్యూ అధికారిగా ఉండాల్సిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలసి భూములు అమ్మేస్తుండడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు సర్పంచ్లు, ఎంపీటీసీలు ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తారని తెలిపారు. ఏదైనా పనిమీద తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సదరు డెప్యూటీ తహసీల్దార్ తన చుట్టూ తిప్పించుకోవడం రివాజుగా మారుతోందన్నారు. డబ్బులు ముట్టజెబితేగానీ పనులు చేయడం లేదని చెప్పారు. స్థానిక తహసీల్దార్ కూడా డెప్యూటీ తహసీల్దార్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, ఆయన చెప్పందే ఒక్క ఫైలు కూడా ముందుకు కదలనీయడం లేదని తెలిపారు. ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్న సదరు డెప్యూటీ తహసీల్దార్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ వెంకటేశ్వర్ సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.