
● జిల్లాలో విచ్చల విడిగా మందుల వినియోగం ● సొంత వైద్యంతో
తిరుపతి తుడా : కడుపు మంట.. కీళ్ల నొప్పులు.. జ్వరం వచ్చినా మెడికల్ షాపును ఆశ్రయించడం అలవాటుగా మారింది. జిల్లాలో సుమారు 80 శాతం మంది ప్రజలు ప్రతి రోజూ చేస్తున్న పని ఇదే. వాట్సాప్ గ్రూప్లలోనూ ప్రసార మాధ్యమాలలో సెకన్లలో రోగాన్ని నయం చేసే మాత్రలు ఇవే అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలకు ప్రజలు నమ్మి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీంతో ప్రజల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా మెడికల్ షాపులు వెలిశాయి. ఇష్టానుసారంగా వైద్యుడి సలహాలు లేకుండా మార్కెట్లోని మెడికల్ షాపులలో విక్రయిస్తున్న మాత్రలను వినియోగిస్తే ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పొద్దున్నే మింగేస్తున్నారు.
పొద్దున లేవగానే బ్రష్ చేయడం ఆలస్యం వైద్యులు సలహా లేకుండా మెడికల్ షాపు వారు ఇచ్చే మాత్రలను ప్రజలు మింగేస్తున్నారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అల్సర్, గ్యాస్ట్రిక్, కీళ్ల నొప్పులు, శ్వాసకోస సమస్యలు, గుండె జబ్బులు, తలనొప్పి, వాంతులు, జ్వరం వంటి ప్రధాన సమస్యలతో బాధపడే రోగులు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నారు. దీంతో జిల్లాలో వృద్ధులు, సాధారణ మధ్యవయస్కులు ప్రతి రోజు ఉదయం రెండు నుంచి ఐదు మాత్రలను తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వాసుపత్రులలో ప్రధాన జబ్బులకు రోజుకు రూ. 4 కోట్లకు పైగా మందుల కోసం వెచ్చిస్తున్నా, ప్రైవేటు మందుల షాపులలో రెండు రెట్లు అధికంగా వ్యాపారం జరుగుతోంది.
యాంటీ బయాటిక్స్తో పొంచి ఉన్న ప్రమాదం
నొప్పి త్వరగా తగ్గాలని తపనతో పెయిన్క్లిలర్స్, యాంటి బయాటిక్స్ను ప్రైవేటు మెడికల్ షాపు సిబ్బంది ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో మెడికల్ షాపు సిబ్బంది చెప్పిన ప్రకారం నొప్పి నుంచి శీఘ్ర ఉపశమనం కోసం అధిక మోతాదులో యాంటిబయాటిక్, పెయిన్కిల్లర్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ మాత్రల వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు ఆరుకాయలుగా వెలిగిపోతోంది.
వాడిన మందులనే మళ్లీ వాడడం ప్రమాదం
జ్వరం, తలనొప్పి, గ్యాస్ట్రిక్ తదితర సమస్యలకు 90 శాతం మంది సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. గతంలో అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ఇచ్చిన మందులను మరోసారి వైద్యులతో సంబంధం లేకుండా అదే మందులను వాడుతున్నారు. ఎక్కువ శాతం మంది చేస్తున్న పొరపాటు ఇదే. అలా వాడడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
– డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ఆర్ఎంవో,
రుయా, తిరుపతి
రిసిప్ట్ లేకుండా మందులు
విక్రయించే వారిపై చర్యలు
వైద్యులు సిఫార్సు లేకుండా ఎవరైనా మందులు విక్రయిస్తే చర్యలు తప్పవు. మందులు విక్రయించాలంటే తప్పనిసరిగా వైద్యుల నుంచి రిసిప్ట్ ఉండి తీరాల్సిందే. అలా నిబంధనలు అతిక్రమించి మందులు విక్రయించే వారిపై ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యకు బాధ్యులవుతారు. ముఖ్యంగా అనస్తీసియా సంబంధిత మత్తు కలిగించే మందులు, సిరప్లు అమ్మే వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయి. – సీహెచ్ హరిప్రసాద్,
అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ కేంద్రం, తిరుపతి జిల్లా
సొంత వైద్యంతో సైడ్ ఎఫెక్ట్
వైద్యుల సలహా లేకుండా సొంత వైద్యంతో ఇష్టానుసారం మందులను వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఎదుర్కోక తప్పదు. మందులను అధికంగా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లివర్, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. వైద్యుల సిఫార్సు లేకుండా మందులు కొనుగోలు చేయడం , అమ్మడం నేరం. ప్రైవేటు మందుల దుకాణాలలో వైద్యుల సలహా లేకుండా మందులు కొనుగోలు చేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. స్వతహాగా మెడికల్ షాపునకు వెళ్లి కొనుగోలు చేసే మందులు వాడితే ఉపయోగం ఉండకపోగా ఇతర సమస్యలు తప్పవు. – డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్ఓ, తిరుపతి జిల్లా

● జిల్లాలో విచ్చల విడిగా మందుల వినియోగం ● సొంత వైద్యంతో

● జిల్లాలో విచ్చల విడిగా మందుల వినియోగం ● సొంత వైద్యంతో

● జిల్లాలో విచ్చల విడిగా మందుల వినియోగం ● సొంత వైద్యంతో