
● శ్రీహరి బస్టాండ్ను పడగొట్టాలని నివేదిక సమర్పించిన ని
తిరుపతి అర్బన్ : తిరుపతిలోని శ్రీహరి బస్టాండ్ను కూల్చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఇటీవల బస్టాండ్ స్థితిగతులను ఇంజినీరింగ్ నిపుణులు పరిశీలించి నివేదిక సైతం సమర్పించారు. ఈ క్రమంలో కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వం సైతం అనుమతులు మంజూరు చేసింది. ఇందుకోసం రూ.18లక్షలు వెచ్చించాలని ఆదేశించింది. దీంతో ఆర్టీసీ అధికారులు టెండర్లు సైతం ఆహ్వానించారు. ఆదివారం దీ మేరకు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామచంద్రనాయుడు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ వరకు టెండర్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. 31వ తేదీలోపు టెండర్లు ఖరారు చేస్తామని, జూన్ మొదటి వారానికి కూల్చివేత పనులు పూర్తి చేయనున్నట్లు వివరించారు. అనంతరం రూ.45లక్షలతో తాత్కాలికంగా రేకులతో నిర్మాణాలు చేపడతామని తెలిపారు.
మల్టీ మోడల్కు కలేనా?
తిరుపతి బస్టాండ్కు నిత్యం 1.10లక్షల నుంచి 1.20 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో రెండేళ్ల క్రితం మల్టీ మోడల్ బస్టాండ్ పేరుతో రూ.500కోట్లు వెచ్చించి 11 అంతస్తులతో ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఆ మేరకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని అనుమతులు పొందారు. వాస్తవానికి గత ఏడాది ఆగస్టులో మల్టీ మోడల్ బస్టాండ్ పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ఈ పనులను గాలికివదిలేశారు.
ఏడు దశాబ్దాల చరిత్ర
తిరుపతిలోని శ్రీహరి బస్టాండ్కు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది.ప్రస్తుతం ఈ బస్టాండ్ భవనం ఇప్పుడు పూర్తిగా దెబ్బతింది. వర్షం వస్తే శ్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఏ క్షణం అయినా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తొలగించాలని నిర్ణయించారు. సుమారు 70 ఏళ్ల కిత్రం 13 ఎకరాల స్థలంలో బస్టాండ్ ఏర్పాటు చేశారు. అందులో తొలిసారిగా శ్రీహరి పేరుతో 18 ప్లాట్ఫామ్లతో బస్టాండ్ నిర్మించారు. అనంతరం ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదే ప్రాంగణంలో శ్రీనివాస, ఏడుకొండలు, పల్లెవెలుగు పేరుతో మరో మూడు బస్టాండ్లు ఏర్పాటు చేశారు.
దశలవారీగా పనులు
తిరుపతి శ్రీహరి బస్టాండ్లో ప్రస్తుతం 18 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. దశలవారీగా ఈ బస్టాండ్ను పడగొట్టనున్నారు. తొలి విడతలో అత్యంత ప్రమాదస్థితిలో ఉన్న మొదటి 6 ప్లాట్ఫామ్ను కూల్చివేయనున్నారు. రెండో దశలో 12వ ప్లాట్ఫామ్ వరకు, 3 దశలో 18వ ప్లాట్ఫామ్ వరకు కూల్చివేత పనులు చేపట్టనున్నారు.