అది హైదరాబాద్‌లోనే జరిగింది.. ముంబైలో కాదు | Video From Hyderabad Falsely Viral As Muslim Adulterating milk In Mumbai | Sakshi
Sakshi News home page

అది హైదరాబాద్‌లోనే జరిగింది.. ముంబైలో కాదు

Aug 21 2020 2:45 PM | Updated on Aug 21 2020 2:49 PM

Video From Hyderabad Falsely Viral As Muslim Adulterating milk In Mumbai - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆగస్టు 19న హైదరాబాద్‌లో డబీర్‌పుర డైరీ ఫాంలో గేదె నుంచి పాలు పిండిన తర్వాత  అవే పాలను గ్లాసులో పోసుకొని తాగి.. మళ్లీ అవే ఎంగిలి పాలను అదే గిన్నెలో పోశాడు. గేదెలు నీళ్లు తాగడం కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో గ్లాసు నీళ్లు ముంచి అపరిశుభ్రంగా ఉన్న నీళ్లను తీసుకొచ్చి మళ్లీ గిన్నెలో కలిపాడు.. దాదాపు 30 సెకన్ల పాటు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పని చేసిన వ్యక్తి పేరు మహ్మద్‌ సోహైల్‌ అని చెప్పారు.

అయితే ఇది ముంబైలో జరిగిందని.. ఆ వ్యక్తి ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి అంటూ కొందరు వ్యక్తులు ట్విటర్‌లో తప్పుడు వార్తలు పెట్టారు. అంతేకాదు.. హిందువులు పూజించే ఆవు నుంచి తీసిన పాలను ఎంగిలి చేసి వారి మనోభావాలను దెబ్బతీశాడంటూ పేర్కొన్నారు.అంతేగాక అతను ఆ పని చేస్తున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో నమాజ్‌కు సంబంధించిన పాటను ప్లే చేస్తున్నట్లుగా చూపించారు. దీనిని దాదాపు వెయ్యిసార్లు రీట్వీట్‌ చేశారు. (ఛీ.. ఇదేం బుద్ధిరా నాయనా)

అయితే ఇదంతా ఫేక్‌ అని.. పాలు పిండిన వ్యక్తి ముంబయికి చెందిన ముస్లిం కాదని హైదరాబాద్‌కు చెందిన కొరీనా సువారెస్ అనే న్యూస్‌ మీటర్‌ తన కథనంలో చెప్పుకొచ్చింది. నిజానికి ఈ ఘటన హైదరాబాద్‌లోనే చోటుచేసుకుందని.. డబీర్‌పురకు చెందిన గౌస్‌ అనే వ్యక్తి డైరీఫాం నడుపుతున్నాడు. గౌస్‌ దగ్గర రాజు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆరోజు వీడియోలో పాలు తాగిన వ్యక్తి రాజు అని పోలీసులు గుర్తించారు. కానీ రాజు పరారీలో ఉండడంతో డైరీ ఫాం నడుపుతున్న గౌస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఇదే విషయమై.. డబీర్‌పుర పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ మాట్లాడారు. వీడియోలో వైరల్‌ అయిన వ్యక్తి ముస్లిం వర్గానికి చెందిన వాడు కాదని.. ఈ ఘటన గౌస్‌ నడుపుతున్న జహంగీర్‌ డైరీ ఫాంలో చోటుచేసుకుంది. వీడియోలో ఉన్న వ్యక్తి రాజు అని.. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడని సత్యనారాయణ పేర్కొన్నారు. 

ఇప్పటికే పోలీసు అధికారులు ఆ డైరీ ఫాంను సీజ్‌ చేశారని.. డైరీ ఫాం నిర్వహిస్తున్న గౌస్‌పై ఐపీసీ 269, సెక్షన్‌ 272, 273 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ముంబైలో జరగలేదని.. హైదరాబాద్‌లోని డబీర్‌పురాలోనే చోటుచేసుకుందని.. ఆ వ్యక్తి ముస్లిం కాదని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement