అయ్యో దేవుడా!.. ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ప్రాచీన ఆలయాలు 

Ranga Reddy: Priests In Bad Situations, Borrows For Puja In Ancient Temples - Sakshi

ఇది నందివనపర్తిలోని ఓంకారేశ్వరాలయం. తాడిపర్తి, నస్దిక్‌సింగారం, నందివనపర్తి, కుర్మిద్ద గ్రామాల పరిధిలో ఈ గుడికి సంబంధించిన 1,450 ఎకరాల భూమి ఉంది. సుమారు 1,200 మంది రైతులు ఇందులో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. కౌలు ద్వారా వచ్చిన సొమ్ముతో ఏటా దేవుని కల్యాణం, ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. 
కానీ కొంత కాలంగా రైతులు కౌలు చెల్లించడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా పైసా రావడం లేదు. దీంతో వేడుకల సంగతి పక్కన పెడితే.. కనీసం ధూపదీప నైవేద్యాలకు సైతం నోచుకోవడం లేదు. 

కొందుర్గు మండలం పెండ్యాలలోని లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయం ఇది. ఈ గుడి పేరున 360 ఎకరాల భూమి ఉంది. కొందుర్గులోని కొంత భాగం, లూర్థునగర్‌ కాలనీలు ఇందులోనే వెలిశాయి. ప్రçస్తుతం 312 మిగిలింది. కౌలు డబ్బులతో ఆలయ నిర్వహణ కొనసాగాలి. మండల కేంద్రంలోని గుడి పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. చారిత్రాత్మకమైన పెండ్యాల ఆలయం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ దేవుడికి దీపం పెట్టే దిక్కు లేకుండాపోయింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్‌ జిల్లాలోని పలు దేవాలయాలు ధూపదీప, నైవేద్యానికి నోచుకోవడం లేదు. ఆలయ ఖజానాలో పైసా లేకపోవడం, భక్తుల నుంచి ఆశించిన మేరకు కానుకలు రాకపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన నెలవారీ ప్రోత్సాహకాలు అందకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా ఆయా దేవాలయాల్లో కొలువైన దేవుళ్లతో పాటు నిత్యం కైంకర్యాలు నిర్వహించే పూజారులకు సైతం ఉపవాసం తప్పడం లేదు. ఆలయాల నిర్వహణ, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, ఒత్తులు, నూనె, హారతి కర్పూరం బిల్లలు, ఇతర పూజా సామగ్రి కోసం అప్పులు చేయక తప్పడం లేదు.  s

నాలుగు మాసాలుగా..  
ఆలయాల్లో పని చేస్తున్న పూజారుల జీవనభృతి కోసం 2008లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం «ధూపదీప నైవేద్య పథకాన్ని తీసుకొచి్చంది. ఇందులో భాగంగా పూజారులకు మొదట్లో రూ.2,500 ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన కేసీఆర్‌ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచింది. ఇందులో రూ.2 వేలు ధూపదీప నైవేద్యాలకు, రూ.4 వేలు పూజారుల నెలవారీ గౌరవ వేతనంగా చెల్లించారు. గత నాలుగు నెలలుగా ఈ ప్రోత్సాహకం అందడం లేదు. గతంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ నుంచే నేరుగా ఈ ప్రోత్సాహాకాలు మంజూరయ్యేవి. ప్రస్తుతం ఈ బాధ్యతలను ఫైనాన్స్‌ విభాగానికి అప్పగించింది. దీంతో నిధుల జారీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. నెలవారీ ప్రోత్సాహకాలు అందకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,679 ఆలయాల్లో పని చేస్తున్న 3,600 మంది పూజారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.  

శివారులో అధ్వానం 
జీహెచ్‌ఎంసీ పరి«ధిలో 1,736 ఆలయాలను ధూప, దీప, నైవేద్య పథకం(డీడీఎన్‌ఎస్‌)లో చేర్చేందుకు ప్రభుత్వం అవకాశం కలి్పంచి, ఆ మేరకు రూ.12.5 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం తీసుకొన 43 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై కమిటీలకు అవగాహన లేకపోవడం, ఉన్న వాళ్లు కూడా ఆలయంలోని విగ్రహాలు, ఇతర వస్తువులు, నిత్య కైంకర్యాల ద్వారా లభించే కానుకలు, హుండీ ఆదాయం సహా స్థిరచరాస్తుల వివరాలను పక్కగా లెక్క చూపించాల్సి వస్తుందనే భయంతో ఇందుకు వెనుకాడుతున్నాయి. ఫలితంగా ఇప్పటి వరకు కేవలం 400 ఆలయాలే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నాయి. మేడ్చల్‌ జిల్లాలో 101 ఆలయాలు, రంగారెడ్డి జిల్లాలో 140 ఆలయాలకు అవకాశం కల్పించినా.. మెజార్టీ ఆలయ కమిటీలు ఇందుకు సుముఖత చూపలేదు. దీంతో ఆయా ఆలయాలను నమ్ముకుని జీవిస్తున్న పేద బ్రాహ్మణులకు నెలవారీ ప్రోత్సాహకం అందకుండా పోతోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే గ్రేటర్‌లోని ఆలయాల నిర్వహణ కొంత మెరుగ్గా ఉన్నా.. మారుమూల ప్రాంతాల్లోని ప్రాచీన ఆలయాల పరిస్థితి అధ్వానంగా మారింది.   

రాజకీయ నిరుద్యోగులకు అడ్డా  
నిత్యం ఆధ్యాత్మికతతో వెల్లివిరియాల్సిన పలు ఆలయాలు రాజకీయ నిరుద్యోగులకు వేదికలుగా మారాయి. కనీస భక్తి భావం లేని వాళ్లు పాలక మండళ్లలో సభ్యులుగా చేరుతున్నారు. సాధారణ భక్తులు సమరి్పంచే విరాళాలు, నిత్య కైంకర్యాలు, ఇతర సేవల ద్వారా లభించే ఆదాయం పక్కదారి పడుతున్న దాఖలాలు జిల్లాలో కోకొల్లలు. కర్మన్‌ఘాట్‌లోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయం సహా ఇంజాపూర్‌ శ్రీవెంకటేశ్వరాలయం, ఆమనగల్లులోని వీరభద్రస్వామి దేవాలయం, శంషాబాద్‌ సమీపంలోని నర్కుడ రామాలయం, కడ్తాల్‌లోని మైసిగండి ఆలయం, కాటేదాన్‌లోని శివగంగ ఆలయాలు రాజకీయ నిరుద్యోగులకు నిలయాలుగా మారాయి. ఆలయ పూజారులు కూడా ప్రత్యేక పూజలకు టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లను, హుండీల్లో భారీగా కానుకలు సమరి్పంచిన సామాన్య భక్తులను పట్టించుకోకుండా.. పాలక మండలి సభ్యులు, వారి బం«ధుమిత్రులు, ప్రముఖుల సేవల్లోనే తరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  

అప్పులు చేయాల్సి వస్తోంది  
పట్టణ ప్రాంతాల్లోని ఆలయాలకు భక్తులు రెగ్యులర్‌గా వస్తుంటారు. కానీ మారుమూల ప్రాంతాల్లోని ప్రాచీన ఆలయాలకు పెద్దగా రారు. ప్రత్యేక పూజలు, హుండీ ఆదాయం అంతగా ఉండదు. ఫలితంగా ఆలయాల నిర్వహణ, ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందులు తప్పడం లేదు. పూలు, పండ్లు, పూజ సామగ్రి కోసం అప్పులు చేయాల్సి వస్తోంది.  
– సునిల్‌జోషి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం 

పేద బ్రాహ్మణులు నష్టపోతున్నారు 
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 1,736 ఆలయాలకు డీడీఎన్‌ఎస్‌లో చేరే అవకాశం కల్పిస్తే.. 400 దరఖాస్తులు వచ్చాయి. ఇతర జిల్లాల నుంచి 1,263 ఆలయాలకు అవకాశం కల్పించగా.. ఆరు వేల అప్లికేషన్లు అందాయి. ఆస్తులు, ఆదాయం భారీగా ఉన్న ఆలయాలు ఇందులో చేరడం లేదు. ఫలితంగా పేద బ్రాహ్మణులు ఇబ్బంది పడాల్సివస్తోంది.  
- వాసుదేవశర్మ, ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top