మద్యం మత్తులో యువకుల వీరంగం

Nalgonda: Alcoholic Youth Creates Nonsense At Petrol Pump - Sakshi

సాక్షి, నల్గొండ: మద్యం మత్తులో గురువారం రాత్రి పెట్రోల్‌బంక్‌ వద్ద యువకులు వీరంగం సృష్టించారు. ఈ సంఘటన నేరేడుచర్ల మండల కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో గల రామకోటేశ్వరరావు హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లలోని శివాజీనగర్‌ చెందిన ఇంజమూరి సాయి వర్మ, ఇంజమూరి సాయి కిశోర్‌ అలియాస్‌ చింటూ, ఇంజమూరి రాకేష్, విద్యానగర్‌కు చెందిన కొమ్ము తిలక్, వైకుంఠాపురానికి చెందిన కేశారపు నితిన్‌ అలియాస్‌ బన్నీ మొత్తం ఐదుగురు యువకులు రెండు ద్విచక్రవాహనాలపై మద్యం మత్తులో గురువారం రాత్రి నేరేడుచర్ల కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో గల రామకోటేశ్వర్‌రావు హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌ వద్దకు వచ్చారు.

మద్యం మత్తులో ఉన్న యువకులు రూ.50ల పెట్రోల్‌ కొట్టమని రూ.500లను బంక్‌లో పనిచేస్తున్న దాసారం గ్రామానికి చెందిన బెజ్జం నాగార్జునకు ఇచ్చారు. మిగిలిన రూ.450లను తిరిగి ఆ యువకులకు ఇచ్చాడు. మద్యం మత్తులో ఉన్న వారు ఇచ్చిన డబ్బులను కిందపడేసి నాగర్జునను అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు దాడికి దిగారు. దీంతో నాగార్జున పక్కనే ఉన్న ఆఫీసు రూంలోకి పరుగెత్తడంతో, అక్కడకు వెళ్లి అందులో ఉన్న ఫైర్‌ సిలిండర్‌ తీసుకొని అద్దాలు, కూర్చీలు పగులకొట్టారు. బంక్‌ రీడింగ్‌ మీటర్లను కూడా ధ్వంసం చేశారు. బంక్‌ యజమాని రాచకొంట రామకోటేశ్వర్‌రావు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top