సాక్షి, మంచిర్యాల: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు ఘటనల్లో.. ఈదురుగాలులకు గోడలు కూలి ముగ్గురు రైతులు మరణించారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
లక్సెట్టిపేటలో గత రాత్రి ఘోరం చోటు చేసుకుంది. ఈదురుగాలులు, అకాల వర్షం నుండి పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్తూరు కొనుగోలు కేంద్రం వద్దకు పరుగులు తీశారు. ఆపై అక్కడే ఉన్న గోడ వద్ద నిల్చున్నారు. ఇంతలో గాలి ధాటికి గోడ మొత్తంగా కుప్పకూలిపోయింది. దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నిల్కి లచ్చన్న (55) , గుండారపు వెంకటేశ్ (24) అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో తనుగుల నాగరాజు, సీదుల హరీష్ ఈ ఇద్దరి పరిస్థితి విషమించడంతో కరీంనగర్కు తరలించారు.
మరోవైపు.. గంపలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద కూడా విషాదం చోటు చేసుకుంది. రైతులపై ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా రేకుల షెడ్డు కూలింది. ఈ ఘటనలో తనుగుల అభిరాం (22) మృతి చెందాడు. గాయపడిన మరో ఇద్దరిని కరీంనగర్కు తరలించారు.
అకాల వర్షాలు, ఈదురు గాలులతో జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రాహదారులపై రాకపోకలు స్తంభించాయి. దీంతో పోలీసులు స్థానికుల సాయంతో చెట్లను తొలగిస్తున్నారు. మరో మూడు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


