హైదరాబాద్: తెలంగాణలో గత 15 రోజులుగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మాజీ ఐపీఎస్ భార్య హత్య జరిగినా, కరీంనగర్ గోల్డ్ షాపులో భారీ చోరీ జరిగినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని విమర్శించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ను 40 మంది ఆకతాయిలు వేధించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి చిన్న విషయానికి 'సిట్' వేస్తారని, మరి రాష్ట్రంలో పెరుగుతున్న ఈ నేరాల పరంపరపై ఎందుకు ప్రత్యేక విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసు శాఖ తూతూ మంత్రంగా పనిచేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.
‘‘రేవంత్ రెడ్డి నిజంగా మీకు, బండి సంజయ్ కు మధ్య ఎలాంటి దోస్తానా లేకుంటే, మీ కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే బండి సాయి భగీరథ్ ను వెంటనే జైలుకు పంపండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నాడు. అమ్మాయి తల్లితండ్రులకు ఎలాంటి హాని జరిగినా దానికి రేవంత్ రెడ్డి, పోలీసులే బాధ్యత వహించాలి. బండి సంజయ్ కొడుకు బాలికపై అఘాయిత్యానికి పాల్పడితే చర్యలేవీ? రేవంత్ రెడ్డి, బండి సంజయ్ స్నేహితులు కాబట్టే చర్యలు లేవు’ అని అన్నారు.


