కా​కతీయ కళాతోరణం, చార్మినార్‌ రాచరీక పోకడనా?: కేటీఆర్‌ కౌంటర్‌ | KTR Slams CM Revanth On State Emblem Decision | Sakshi
Sakshi News home page

కా​కతీయ కళాతోరణం, చార్మినార్‌ రాచరీక పోకడనా?: కేటీఆర్‌ కౌంటర్‌

May 28 2024 5:43 PM | Updated on May 28 2024 6:41 PM

KTR Slams CM Revanth On State Emblem Decision

KTR | హైద‌రాబాద్ : ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సంద‌ర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాక‌తీయ క‌ళాతోర‌ణం ఉండ‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమ‌ర్శించారు.

సాక్షి, హైద‌రాబాద్: రాష్ట్ర ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ ఉండదంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌​ ప్రెసిడెంట్‌ కౌంటర్‌ ఇచ్చారు. అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ, చార్మినార్‌ రాచరీక పోకడ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో కాక‌తీయ క‌ళాతోర‌ణం, చార్మినార్ అనేవి రాచ‌రిక‌పు గుర్తులు కాదని, వెయ్యేళ్ల సాంస్కృతి వైభ‌వానికి చిహ్నాలు అని పేర్కొన్నారు.

ఈ మేరకు ట్విటర్‌లో కేటీఆర్‌ స్పందిస్తూ..‘ ముఖ్యమంత్రి గారు..

ఇదేం రెండునాల్కల వైఖరి..!
ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన..!!

మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..!
చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు..!!

అవి రాచరికపు గుర్తులు కాదు..!
వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!
వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు..!!!

జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ?
“కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్”

అధికారిక గీతంలో కీర్తించి..!!
అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..??

చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు..
విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్

కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు..
సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం..

తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి.. 
వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే..!
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే..!!

మీ కాంగ్రెస్ పాలిస్తున్న... 
కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి.. 
మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి..??

భారత జాతీయ చిహ్నంలోనూ.. 
అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి..
జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది..
వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి..??

కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ?
ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ?

ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు..
రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..?

గత పదేళ్లుగా.. 
ప్రభుత్వ అధికారిక చిహ్నంపై.. 
యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది.. 
సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది..

రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో.. 
రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించం

పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా... 
మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..!
తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..!!’  అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement