పోలీసు విధులపై కోవిడ్‌ దెబ్బ

Corona Effect On Police Duties - Sakshi

ఇప్పటికే 1,600 వరకు పోలీసులకు పాజిటివ్‌

విమెన్‌సేఫ్టీ వింగ్‌ ఏడీజీ స్వాతి లక్రాకు కరోనా

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ఫ్రంట్‌ లైన్‌ వారి యర్స్‌ అయిన పోలీసులను కోవిడ్‌ 19 అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. వైరస్‌ నిర్మూలనలో 24 గంటలూ శ్రమిస్తున్న పోలీసులు కరోనా బారిన పడుతుండటం వారికి, వారి కుటుంబాలకు, తోటి సిబ్బందికీ ఇబ్బందికర పరిణామంగా మారుతోంది. మొదట్లో గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని పోలీసులే కరోనా బారిన పడ్డారు.

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖలో సుమారు 1,600 మందికి పైగా అధికారులు, సిబ్బంది కోవిడ్‌ బారినపడ్డట్లు సమాచారం. ఇందులో సగానికిపైగా అంటే 800 మందికి పైగా గ్రేటర్‌ పోలీసులే. పోలీసులు కరోనా బారిన పడటంతో వారి తోటి సిబ్బంది కూడా క్వారంటైన్లో ఉండాల్సి వస్తోంది. దీంతో సిబ్బంది కూడా సెలవులు పెట్టాల్సి వస్తోంది. ఫలితంగా కేసుల నమోదు, దర్యాప్తు, బందోబస్తు, గస్తీల విధుల భారం మిగిలిన వారిపై పడుతోంది. ఇటీవల బక్రీదును ఎలాగోలా నెట్టుకొచ్చినా.. ఈ ప్రభావం త్వరలో జరిగే స్వాతంత్య్ర వేడుకలపైనా పడేలా ఉంది.

హోంక్వారంటైన్‌లో స్వాతిలక్రా
ఇటీవల అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పదోన్నతి పొందిన మహిళా భద్రతా విభాగం చీఫ్‌ స్వాతి లక్రా కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. తీవ్ర లక్షణాలు లేకపోవడంతో ఆమె ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top