ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివతేజ
మెదక్ జిల్లాలో ఘటన
నర్సాపూర్ రూరల్: బ్యాటరీ పేలి బాలుడి చేతి వేళ్లు తెగిపడ్డాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రాజీపేట సత్తయ్య చిన్న కుమారుడు శివతేజ 4వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో తోటి పిల్లలతో కలిసి గ్రామంలోని ఓ కిరాణ షాపులో బ్యాటరీ, ఒక చిన్న ఫ్యాన్ను కొనుగోలు చేసి.. ఆ బ్యాటరీతో ఫ్యాన్కు కనెక్షన్ ఇచ్చి సరదాగా ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఒక్కసారిగా బ్యాటరీ పేలి, శివతేజ ఎడమ చేతి మూడు వేళ్లు తెగిపడ్డాయి. దీంతో బాధిత బాలుడితో పాటు తోటి పిల్లలు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. వెంటనే బాలుడిని కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు వైద్యుని వద్ద ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుని వేళ్లకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు అతడి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.


